పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది మొదట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించిన అజ్ఞాతవాసి మూవీతో సినిమాలకు స్వస్తి పలికి పూర్తిగా రాజకీయాలకే పరిమితం అయ్యారు. అయితే అప్పట్లో పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో విపరీతమైన క్రేజ్ తో రిలీజ్ అయిన ఆ సినిమా, అతిపెద్ద డిజాస్టర్ గా నిలవడంతో, పవన్ ఫ్యాన్స్ ఢీలా పడ్డారు. పవన్ సిల్వర్ జూబిలీ సినిమాగా వచ్చిన ఆ సినిమా, తప్పకుండా మంచి విజయాన్ని అందుకుని, ఆయన కెరీర్ లో మంచి సినిమాగా నిలిచిపోతుందన్న వారి ఆశలకు అజ్ఞాతవాసి పూర్తిగా గండి కొట్టింది. 

అయితే అప్పటి నుండి పవన్ తమ కోసం ఒక్క సినిమాలో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తమ కోసం ఒక మంచి సినిమా చేసి, ఆ తరువాత ఆయన ప్రజాక్షేత్రంలోకి వెళితే బాగుంటుందని వారు గత కొద్దిరోజుల నుండి ఆయనను కొంత ఒత్తిడి చేస్తున్నారు. అయితే ఇప్పటికే పూర్తిగా తన జీవితాన్ని ప్రజలకే అంకితం చేయాలని భావించిన పవన్ ను, ఇటీవల తన జన్మదినం సందర్భంగా కలిసిన మెగాస్టార్ చిరంజీవి, అభిమానుల కోసం సినిమాలు చేయవలసిందిగా హితవు పలికినట్లు సమాచారం. అందుకు పవన్ కూడా చాలావరకు సుముఖత వ్యక్తం చేసినట్లు చెప్తున్నారు. అది మాత్రమేకాక, పవన్ త్వరలో మైత్రి మూవీ మేకర్స్ తోనే మళ్ళి సినిమాల రీఎంట్రీ మొదలెడతారని, 

ఆ తరువాత తన స్నేహితుడైన రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఒక సినిమా, అనంతరం ఏఎమ్ రత్నంతో మరొక సినిమా చేస్తారనే వార్తలు కూడా ప్రచారం అవుతున్నాయి. ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది ఇప్పుడే చెప్పలేం అని, ఎందుకంటే ఈ వార్తపై స్వయంగా పవన్ కళ్యాణ్ గారి నుండి అధికారిక ప్రకటన వెలువడితేనే గాని నమ్మలేం అంటున్నారు సినీ విశ్లేషకులు. ఒకవేళ ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే పవన్ ఫ్యాన్స్ కి ఇది అతి పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: