పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం 'రొమాంటిక్'. అనిల్ పాడురి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. చిత్రీకరణ కోసం బృందం వేసిన సెట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. సెట్ నిర్మాణంలో వాడిన క్లాత్ మెటీరియల్ కు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. యూనిట్ సభ్యులు ధైర్యం చేసి మంటలను అదుపుచేసే ప్రయత్నం చేసినా క్లాత్ మెటీరియల్ కావడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో టీమ్ ఇతర ఖరీదైన వస్తువులను లొకేషన్ నుండి తొలగించి నష్టాన్ని తగ్గించగలిగారు. కానీ క్లాత్ ప్రాపర్టీస్ మాత్రం చాలా వరకు అగ్నికి ఆహుతయ్యాయి. అదృష్టవశాత్తు ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఇక ఈ ప్రమాదానికి సెట్ బాయ్ అశ్రద్ధనే కారణమని తెలిసింది.
ఇక డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కుమారుడు ఆకాష్ పూరిని హీరోగా పరిచయం చేస్తూ.. మెహబూబా చిత్రం తీశారు. కానీ ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినప్పటికీ, పూరి మాత్రం తన కుమారుడిని హీరోగా బాగానే ప్రమోట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే నూతన దర్శకుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో ఆకాష్ ని హీరోగా పెట్టి 'రొమాంటిక్' సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించిన్నట్లు తెలుస్తోంది.
ఇక రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ బాగా వైరల్ ఆయిన సంగతి తెలిసిందే. హీరోయిన్ కేతిక టాప్ లెస్ గా హీరోని కౌగిలించుకోవడం.. ఘాడమైన ప్రేమలో ప్రపంచాన్ని మర్చిపోయిన ప్రేమ జంటగా వీరిద్దరూ కనిపించడంతో పోస్టర్ యూత్ ను బాగా ఆకట్టుకుంది. మొత్తానికి ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమా పై అంచనాలను పెంచింది. ఈ సినిమా మాఫియా నేపథ్యంలో ఓ ప్రేమ కథగా తెరకెక్కనుందట. మరి ఈ సినిమాతోనైనా ఆకాష్ పూరికి హిట్ వస్తోందేమో చూడాలి. ఈ రొమాంటిక్ మూవీలో బాలీవుడ్ నటి మందిరా బేడీ ఓ కీలక పాత్రలో నటిస్తుందట. అలాగే మరో హిందీ నటుడు మకరంద్ దేశ్ పాండే కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాల పై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.