'ఎవడే సుబ్రమణ్యం' సినిమాతో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు నాగ్ అశ్విన్. ఆ తర్వాత దాదాపు మూడు సంవత్సరాలు గ్యాప్ తీసుకుని తన రెండవ సినిమా 'మహానటి'ని గత ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. సావిత్రి జీవితాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు కమర్షియల్ గా తీసుకువచ్చి బయోపిక్ ను ఇలా కూడా తీయవచ్చా అంటూ అందరిని ఆశ్చర్యపరిచాడు. అంతేకాదు ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తాన్ని ఆకట్టుకొని మెగాస్టార్ లాంటి వాళ్ళ ప్రశంసలు అందుకొని స్టార్ డైరెక్టర్ గా పేరును సంపాదించుకున్నాడు. దీనితో పాటు జాతీయ అవార్డును సొంతం చేసుకున్న నాగ్ అశ్విన్ దర్శకుడిగా తన మూడవ సినిమాను ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తాడా అని ప్రేక్షకులతో పాటు సినీ ఇండస్ట్రీ మొత్తం ఎదురు చూస్తున్నారు.  

అయితే నాగి అందరికి చిన్న షాకిచ్చాడు. అనూహ్యంగా నాగ్ అశ్విన్ నిర్మాతగా మారి స్వప్న సినిమా బ్యానర్ పై 'జాతిరత్నాలు' అనే సినిమాని నిర్మిస్తున్నాడు. తన భార్య ప్రియాంక దత్ కు చెందిన స్వప్న సినిమా బ్యానర్ లోనే నాగ్ అశ్విన్ నిర్మాతగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాతో అనుదీప్ కేవీ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. విభిన్నమైన కాన్సెప్ట్ అవ్వడం వల్ల నాగ్ అశ్విన్ నచ్చి స్వయంగా నిర్మించేందుకు ముందుకు వచ్చాడట.

'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' ఫేం నవీన్ పొలిశెట్టి హీరోగా యంగ్ కమెడియన్స్ ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ  ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. దాదాపుగా 75 శాతం షూటింగ్ పూర్తి అయిన ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారట. ఇక ఈ సినిమాకు రాధన్ సంగీతాన్ని అందింస్తున్నాడు. అయితే నాగ్ అశ్విన్ మెగాస్టార్ కోసం ఒక అద్భుతమైన కథ సిద్దం చేస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అదే గనక నిజమైతే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం అంత కష్టమేమి కాదు. ఎందుకంటే మెగాస్టార్ కి వైజయంతి మూవీస్ బ్యానర్ తో మంచి అనుబంధం ఉంది. అంతేకాక ఇప్పటికే నాగి మెగాస్టార్ ని బాగా ఇంప్రెస్ కూడా చేశాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: