యంగ్ టైగర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్'. కాగా రామ్ చరణ్ చాల రోజుల గ్యాప్ తరువాత ఈ రోజు హైదరాబాద్ లో జరుగుతున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్ లో ఇద్దరి హీరోల మీద కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజులా, తారక్ కొమరం భీంలా నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో మొదటి సారి వీరిద్దరు కలుసుకునే సన్నివేశాలను రాజమౌళి ఈ రోజు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ ఓ వీరోచిత పోరాటాన్ని ప్రదర్శిస్తోన్న సందర్భంలో.. అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్ చరణ్ చూస్తాడట. అలా భీంని చూసి రాజు అతని పట్ల అమితమైన గౌరవాన్ని పెంచుకుంటాడట.
'బాహుబలి' సిరీస్ తర్వాత జక్కన్న నుండి వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ సరసన ఇద్దరూ హీరోయిన్స్ నటిస్తున్నారు. ఇప్పటికీ మొదటి హీరోయిన్ గా ఓ విదేశీ భామను ఫైనల్ చేశాడు రాజమౌళి. అయితే ఆమె గురించి ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అలాగే రెండో హీరోయిన్ పాత్ర కూడా ఉందట. సినిమాలో ఓ గిరిజన యువతి ఎన్టీఆర్ పాత్రను ప్రేమిస్తోందట. ఆ పాత్రలోనే ఓ బాలీవుడ్ హీరోయిన్ ను తీసుకోనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో డైలాగ్ లు చాలా బాగుంటాయని.. సినిమాలో ప్రధాన హైలెట్స్ లో డైలాగ్ లు కూడా హైలెట్ అవ్వనున్నాయి. ముఖ్యంగా తెలంగాణ యాసలో ఎన్టీఆర్ పలికే డైలాగ్ లు చాలా కొత్తగా ఉంటాయట. సుమారు రూ.400 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని వచ్చే యేడాది జూలై 30న విడుదలచేయనున్నారు.
కాగా సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి. మొత్తానికి రాజమౌళి కూడా సినిమా పై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.