తమన్నా, విశాల్ తాజాగా నటించిన చిత్రం 'యాక్షన్‌'. సుందర్‌.సీ దర్శకత్వంలో ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ పతాకంపై రవీంద్రన్‌ నిర్మించిన ఈ చిత్రానికి హిప్‌హాప్‌ తమిళా సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ స్థానిక ప్రసాద్‌ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 


మీడియా సమావేశంలో చిత్ర కథానాయకుడు విశాల్‌ మాట్లాడుతూ.. సామాజిక ఆలోచనలు ఉన్నా సంపాదన కూడా ముఖ్యం అని తనకు తెలియజేసింది దర్శకుడు సుందర్‌.సీ అని పేర్కొన్నారు. సంఘమిత్ర సుందర్‌.సీ డ్రీమ్‌ చిత్రం అన్నారు. దాని నిర్మాణం ఆలస్యం కావడంతో మధ్యలో ఈ చిత్రం చేసినట్లు తెలిపారు. తన కెరీర్‌లోనే అధిక ఫైట్స్‌ కలిగిన చిత్రం, అధికంగా దెబ్బలు తిన్న చిత్రం ఇదేనని తెలిపారు. ఆయన నుంచి నేర్చుకున్న విషయాలను ఇకపై తన చిత్రాలకు ఉపయోగించుకుంటానని చెప్పారు. 


ఒక సమయంలో తన చావును తాను కళ్లారా.. చూశానని చెప్పారు. ఒక సన్నివేశంలో నటిస్తుండగా కాళ్లు, చేతులకు గాయాలు కావడంతో 5 నెలలు షూటింగ్‌ చేయలేని పరిస్థితి అని తెలిపారు. అయినా దర్శక నిర్మాతలు తన కోసం వేచి ఉన్నారని చెప్పారు. ఏడాదికి ఒక చిత్రాన్ని సుందర్‌.సీ దర్శకత్వంలో నటిస్తే ఆరోగ్యం బాగుంటుందన్నారు. 


తన గురువు అర్జున్‌ అయినా, ప్రతి ఒక్కరూ ఈగో ఫీలవకుండా సుందర్‌.సీ వద్ద అసిస్టెంట్‌గా పనిచేయాలన్నారు. ఆయన ఒక సాధారణ ప్రాంతాన్ని కూడా బ్రహ్మాండంగా చూపించగలరని అన్నారు. 90 రోజుల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేయడం సవాల్‌తో కూడిన విషయంగా పేర్కొన్నారు. ఒక సహాయ దర్శకుడిగా తానాయననుంచి చాలా నేర్చుకున్నానని చెప్పారు. ఫైట్స్‌ సన్నివేశాల్లో తనకు నటి తమన్నాకు కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యిందని చెప్పారు. ఇక నటి ఆకాంక్షపురి గురించి చెప్పే తీరాలని, తాను ఇంతకు ముందెప్పుడూ మహిళలను కొట్టిందేలేదన్నారు. అలాంటిది ఈ చిత్రంలో సన్నివేశాల కోసం నటి ఆకాంక్షపురిని పలుమార్లు కొట్టాల్సి వచ్చిందని చెప్పారు. యాక్షన్‌ చిత్రాన్ని అందరూ సినిమా థియేటర్లలో చూడాలని నటుడు విశాల్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: