ప్రస్తుతం వి సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు నేచురల్‌ స్టార్‌ నాని. ఈ సినిమా తరువాత చేయబోయే సినిమాకు రెడీ అవుతున్నాడు. గతంలో నాని హీరోగా 'నిన్ను కోరి' సినిమాను తెరకెక్కించిన శివా నిర్వాణ దర్శకత్వంలో నెక్ట్స్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే కథా చర్చలు కూడా పూర్తయిన ఈ సినిమా డిసెంబర్‌లో సెట్స్‌ మీదకు వెళ్లనుంది. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాలో నానికి జోడిగా రీతూ వర్మ నటించనుందని తాజా సమాచారం. నాని కెరీర్‌ను మలపు తిప్పిన ఎవడే సుబ్రమణ్యం సినిమాతో నాని, రీతూలు కలిసి నటించారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరు జోడి కడుతుండటంతో ఈ కాంబినేషన్ పై ఆసక్తి పెరిగింది.

 

నాగచైతన్య, సమంత హీరో హీరోయిన్లుగా మ‌జిలీ లాంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత శివ నిర్వాణ ద‌ర్శక‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతుంది. డిసెంబ‌ర్ నెల‌లో సినిమా లాంఛ‌నంగా ప్రారంభించి జ‌న‌వ‌రి నుండి రెగ్యుల‌ర్ షూటింగ్‌ మొదలు పెట్టేందుకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్రయూనిట్‌. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

 

ఇక ప్రస్తుతం నాని ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వి సినిమాలో నటిస్తున్నాడు. సుధీర్‌ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నాని నెగిటివ్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లీటయిన తరువాత శివ నిర్వాణ సినిమాలో జాయిన్ అవుతాడు. ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కిన బాద్‌షా సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన రీతూవర్మ ఎవడే సుబ్రమణ్యం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తరువాత పెళ్లి చూపులు సినిమాతో సూపర్‌ హిట్ అందుకొని హీరోయిన్‌గా సెటిల్‌ అయిపోయింది. పెళ్లి చూపులు తరువాత తెలుగులో 'కేశవ' సినిమా మాత్రమే చేసిన రీతూ మూడేళ్ల తరువాత తిరిగి తెలుగు సినిమాలో నటిస్తోంది. మరి ఈ సినిమా తర్వాత అయినా వరుసగా అవకాశాలు వస్తాయా లేదా అన్నది రీతూ మీదే ఆధారపడి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: