సరిలేరు నీకెవ్వరు అంటూ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అనిల్ రావిపుడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే రిలీజైన టీజర్ సినిమా మీద అంచనాలను పెంచేసింది. చాలా రోజుల తర్వాత మహేష్ బాబు చేస్తున్న మాస్ సినిమా కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

విడుదలైన టీజర్ ఇప్పటికే జనాల్లోకి వెళ్ళిపోయింది. ఆర్మీ ఆఫీసర్ గా మహేష్ నుండి వచ్చే మాటలు టీజర్ ని మరో స్థాయికి తీసుకెళ్ళాయి. అలాగే ఫైటింగ్ సీన్స్ లో మహేష్ పలికిన మాస్ డైలాగ్స్ అందర్నీ అలరిస్తున్నాయి. ఒక్క టిజర్ తో మహేష్ సినిమాకి విపరీతమైన హైప్ వచ్చేసింది. అలాగే ఈ టీజర్ ద్వారా అనేక రికార్డులు కూడా క్రియేట్ చేశాడు మహేష్. ఇండియా లెవెల్ లో ఎక్కువ మంది ఎదురు చూస్తున్న చిత్రంగా సరిలేరు నీకెవ్వరు చిత్రం నిలిచిందంటే ఎంత హైప్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

 

ఇదిలా ఉంటే నిన్న ఈ సినిమా నుండి మొదటి పాట రిలీజ్ అయిందన్న విషయం తెలిసిందే. మైండ్ బ్లాక్ అంటూ సాగే పాట విపరీతంగా ఆకట్టుకుంది. మాస్ ఐటమ్ బీట్స్ కి పెట్టింది పేరైన దేవిశ్రీ అందించిన మైండ్ బ్లాక్ సాంగ్ మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది. సంక్రాంతి కి వెండి తెరపై ఈ సాంగ్ పటాసులా పేలడం ఖాయంగా కనిపిస్తుంది. బ్లేజ్ మరియు రనీనా రెడ్డి పాడగా శ్రీమణి, దేవీశ్రీ సాహిత్యం అందించారు.

 

ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నిలిచింది. పాట విడుదల అయి ఇరవై నాలుగు గంటలు అవకముందే ఐదు మిలియన్ల వ్యూస్ చేరుకోవడం రికార్డుగా నిలిచింది. ఈ సినిమా నుండి ఇంకా నాలుగు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. మరి ఆ పాటలెన్ని రికార్డులు సృష్టిస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: