గత కొంత కాలంగా క్రికెట్ లో నో బాల్స్ గురించి విపరీతమైన చర్చ నడుస్తుంది. ఫీల్డ్ అంపైర్లు నో బాల్స్ ని సరిగ్గా గుర్తించట్లేదన్న వాదన రోజు రోజుకీ పెరుగుతోంది. అంపైర్లు ఫ్రంట్ ఫుట్ నో బాల్స్ ని సరిగ్గా గుర్తించకపోవడం వల్ల మ్యాచులని చేజార్చుకున్న జట్లు చాలా ఉన్నాయి. బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇరవై ఒక్క నో బాల్స్ ని గుర్తించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
అయితే ఈ నో బాల్స్ పట్ల ఏమైనా చేయాలన్న ఉద్దేశ్యంతో ఐసిసి ఒక సరికొత్త నిర్ణయం తీసుకుంది. గతంలో కేవలం నీ బాల్స్ ని గుర్తించడానికి మాత్రమే ఒక ఫీల్డ్ అంపైర్ ని నియమిస్తారని వార్తలు వచ్చాయి. కానీ మరో ఫీల్డ్ అంపైర్ కి బదులు నో బాల్స్ ని గుర్తించే బాధ్యతని థర్డ్ అంపైర్ కి అప్పగించేందుకు నిర్ణయించింది. అంటే ఇక నుండి నో బాల్స్ ని గుర్తించడం థర్డ్ అంపైర్ల పనే అన్నమాట.
ఈ మేరకు గురువారం ఐసీసీ తన నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే ఈ నియమాన్ని భారత్-వెస్టిండీస్ల మధ్య జరిగే టీ20, వన్డే సిరీస్లలో దీనిని ట్రయల్ చేయనున్నట్లు తెలిపింది. దీంతో శుక్రవారం జరిగే భారత్-వెస్టిండీస్ల మధ్య జరిగే తొలి టీ20 నుంచే ఈ కొత్త నిబంధనకు అంకురార్పణ జరగనుంది. ఈ సిరీస్లతో పాటు కొన్ని నెలలు ఈ నిబంధనను పరిశీలించి తర్వాత పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని ఐసీసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మరి ఐసీసీ ప్రవేశ పెడుతున్న ఈ నియమ వల్ల థర్డ్ అంపైర్ పై భారం పెరగనుంది. ఈ నిబంధన ప్రకారం థర్డ్ అంపైర్ ఫ్రంట్ ఫుట్ బాల్ నోబాల్స్ను గుర్తించి ఫీల్డ్ అంపైర్కు సూచిస్తాడు. అదేవిధంగా థర్డ్అంపైర్తో చర్చించకుండా ఫీల్డ్ అంపైర్ నోబాల్స్ను ప్రకటించకూడదు. ఒక వేళ బ్యాట్స్మన్ ఔటైన బంతి నోబాల్ అని థర్డ్ అంపైర్ ప్రకటిస్తే ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది. మరి ఈ కొత్త నిబంధన ఏ మేరకు పని చేస్తుందో ఈ మ్యాచుల్లో తెలిసిపోతుంది.