దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి తరువాత ప్రభాస్‌ ఇమేజే పూర్తిగా మారిపోయింది. పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌, తన నెక్ట్స్ సినిమాను కూడా అదే రేంజ్ లో ప్లాన్‌ చేశాడు. బాహుబలి ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే సాహో ఏ ఒక్కరిని ఊహించిన రేంజ్ లో ఆకట్టుకోలేక పోయింది. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన సాహో నిర్మాతలకు తీవ్ర నష్టాలను మిగిల్చింది. ఒక్క హిందీలో తప్ప మిగతా అన్ని భాషల్లోను ఈ సినిమాకు నష్టాలు రావటంతో తర్వాత సినిమాల విషయంలో నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. సాహో రిలీజ్‌కు ముందే నెక్ట్స్ సినిమాను ప్రారంభించాడు ప్రభాస్‌.

 

జిల్‌ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్‌ రొమాంటిక్‌ డ్రామాలో నటిస్తున్నాడు ప్రభాస్‌. ఈ సినిమా ఎక్కువగా ఇటలీలో చిత్రీకరణ జరగనుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌తో కలిసి ప్రభాస్‌ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు గోపీకృష్ణ మూవీస్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ముందుగా ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని ప్లాన్ చేశారు. అందుకోసం ఇటలీలో భారీ షెడ్యూల్‌ను ప్లాన్‌ చేశారు. ప్రభాస్‌ పాత్ర కోసం పెద్ద ఎత్తున వింటేజ్‌ కార్లను కూడా తీసుకువచ్చారు. అయితే సాహో రిజల్ట్‌ తరువాత నిర్మాతలు ఆలోచనలో పడ్డారట. ముందుగా అనుకున్న బడ్జెట్‌ కాకుండా బాగా లిమిటెడ్‌ బడ్జెట్‌లోనే సినిమా కంప్లీట్ చేస్తే బెటరని డిసైడయ్యారట. 

 

అయితే ప్రస్తుతం ప్రభాస్‌కు పాన్‌ ఇండియా లెవల్‌లో మార్కెట్‌ ఉంది. ఫ్లాప్‌ టాక్‌ వచ్చిన సాహో కూడా బాలీవుడ్‌లో బాగానే కలెక్ట్ చేసింది. అందుకే నెక్ట్స్ సినిమాను కూడా మరీ భారీగా కాకపోయినా దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందించేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాకు 'జాన్‌' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్‌ ఆస్ట్రాలజర్‌ పాత్రలో నటిస్తున్నాడన్న ప్రచారం ఇప్పుడు కొత్తగా సాగుతోంది. ఏదేమైనా సాహో ఎఫెక్ట్ ప్రభాస్ నెక్స్ట్ సినిమాల మీద బాగానే పడిందని చెప్పుకుంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: