‘చిత్రలహరి’ లాంటి డీసెంట్ హిట్ తరవాత సాయి తేజ్ నటించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’ ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా హీరోహీరోయిన్లుగా నటించగా సత్యరాజ్ కీలక పాత్ర పోషించారు. యూత్ఫుల్ చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించగా గ్రామీణ నేపథ్యంలో పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ను రాబట్టుకుంది.
ఇకపోతే నేటికాలంలో డబ్బు సంపాదన మీద పడి రక్తం పంచిన వారిని వదిలి రెక్కలు కట్టుకుని సప్త సముద్రాలు దాటి బ్రతకడానికి నేటి యువత వెనకాడటం లేదు. ఇదే పాయింట్తో తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేసే పిల్లల గురించిన కథలు పలుమార్లు సినిమాలయ్యాయి. ఇకపోతే ‘ప్రతిరోజూ పండగే’ చిత్రంలో రావు రమేష్ పాత్ర మంచి, చెడుకి మధ్య ఊగిసలాడుతున్నట్టు కనిపిస్తుంటుంది కానీ మిగతా పిల్లల ధోరణి మరీ ఘోరం.
ఒక పాయింట్కి వచ్చేసరికి ఎమోషన్ కోసం రావు రమేష్ని అందరికంటే హేయంగా మార్చేసారు. ''ఎక్కడికెళ్లినా నిమిషం అటు, ఇటు కాకుండా వెళ్లిపోయే నువ్వు చావు విషయంలో మాత్రం ఎందుకు టైమింగ్ మిస్సయ్యావ్'' అంటూ తండ్రి త్వరగా చావలేదని మాట్లాడే కొడుకులు వుండవచ్చునేమో కానీ ఇందులో రావు రమేష్ పాత్ర అయితే అంతకి దిగజారకూడదు. ఎమోషన్స్ చిన్న చిన్న అపార్ధాలు, అపోహలతో కూడా రేకెత్తించవచ్చు. ఇలాంటివి మరీ ఈ సన్నివేశంలో ప్రేక్షకులకి చివుక్కుమనాలి అని చేసినట్టు అనిపిస్తాయి. ఈ తంతు అంతా క్లయిమాక్స్లో సదరు పిల్లలకి కనువిప్పు కోసం జరుగుతుంది, ఇక మొత్తానికి రావు రమేష్ టైమింగ్ అద్భుతంగా ఉందని నెటిజన్ల అభిప్రాయపడుతున్నారు.