టాలీవుడ్ లో ప్రస్తుతం మల్టీస్టారర్ మూవీస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఇక స్టార్ ప్రొడ్యూసర్ డి రామానాయుడు తనయుడు దగ్గుబాటి వెంకటేశ్ ‘కలియుగపాండవులు’ మూవీతో హీరోగా పరిచయం అయ్యారు. కెరీర్ బిగినింగ్ లో యాక్షన్ తరహా సినిమాలతో అలరించిన ఆయన తర్వాత ఫ్యామిలీ తరహా సినిమాల్లో నటించి తనదైన కామెడీ మార్క్ చాటుకున్నారు. అప్పట్లో వెంకి సినిమాలంటే మినిమం గ్యారెంటీ అనే స్థాయిలో ఉండేవి. కొంత కాలంగా ఆయన మల్టీస్టారర్ మూవీస్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మహేష్ బాబు తో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, పవన్ కళ్యాన్ తో గోపాల గోపాల, రామ్ తో మసాలా ఈ ఏడాది వరుణ్ తేజ్ తో ఎఫ్ 2 మూవీతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు.
ఇక తన సొంత మేనళ్లుడు అక్కినేని నాగ చైతన్య తో కలిసి బాబీ దర్శకత్వంలో ‘వెంకిమామ’ మూవీలో నటించాడు. ఈ మూవీ గత శుక్రవారం రిలీజ్ అయి మంచి విజయం అందుకుంది. కలెక్షన్లు కూడా బాగానే రాబడుతున్నాయి. తాజాగా వెంకటేశ్ నటించిన 'వెంకీమామ' మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న వేళ, అనాధ బాలల కోసం మూవీని ఐనాక్స్ లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి స్వయంగా హాజరైన వెంకటేశ్, పిల్లలతో కలిసి కాసేపు సరదాగా సందడి చేశారు.
తమ అభిమాన హీరో వెంకిమామ వెంకటేశ్ వచ్చాడని తెలియగానే చిన్నారుల్లో ఆనందోత్సాహాలు పెల్లుబికాయి. పిల్లలతో కలిసి కాసేపు సరదాగా సందడి చేశారు. వారిని పలకరిస్తూ, సెల్ఫీలు ఇస్తూ కనిపించారు. పిల్లలు తమ స్కూలుకు రావాలని కోరగా, తప్పకుండా వస్తానని చెప్పారు. చిన్నారులతో పాటు పెద్దలు కూడా తమ అభిమాన హీరోతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. తన సినిమాకు ఇంత ఆదరణ చూపినందుకు సంతోషం తెలిపారు వెంకటేశ్. ఈ సందర్భంగా పిల్లలకు చిన్న చిన్న బహుమతులనూ ఆయన అందించారు.