టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ-కన్నడ బ్యూటి రష్మిక మందన్న నటించిన 'గీత గోవిందం' సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న దర్శకుడు పరశురామ్‌.. లాంగ్ గ్యాప్‌ తరువాత ఇటీవల కొత్త సినిమాను ప్రారంభించాడు. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లకముందే తన నెక్ట్స్ సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చాడు పరశురామ్‌. యువత సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన పరశురామ్‌, అల్లు శిరీష్‌ హీరోగా తెరకెక్కిన శ్రీరస్తు శుభమస్తు సినిమాతో తన అకౌంట్ లో మొదటి విషయాన్ని వేసుకున్నాడు. తరువాత గీత గోవిందంతో బ్లాక్‌ బస్టర్‌ హిట్ కొట్టి స్టార్ హీరోల దృష్టిలో పడ్డాడు. ఈ సినిమా సక్సెస్‌తో పరశురామ్‌ క్రేజీ డైరెక్టర్‌గా మారిపోయాడు. అదే జోరులో సూపర్‌ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేశాడు. మహేష్‌కు కథ కూడా వినిపించిన పరశురామ్‌.. డేట్స్‌ మాత్రం సంపాదించలేకపోయాడు.

 

మహేష్ నుంచి సానుకూల స్పందన రాకపోవటంతో ఇతర హీరోలతో సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేశాడు. ప్రభాస్‌, అల్లు అర్జున్‌ లాంటి హీరోలతో పరశురామ్ సినిమా చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే అవేవి వర్క్‌ అవుట్‌ కాకపోవటంతో ఫైనల్‌గా నాగచైతన్యతో సినిమాను ప్రారంభించాడు. 14 రీల్స్‌ ప్లస్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఇక తాజాగా విశాఖపట్నంలోని అడివివరం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని సతీ సమేతంగా దర్శించుకున్నాడు పరశురామ్‌. ఈ సందర్భంగా అక్కడి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహేష్‌తో చేయబోయే సినిమాకు కథ సిద్ధంగా ఉందన్న పరశురామ్‌.. నాగచైతన్య తో ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తయిన వెంటనే మహేష్ సినిమాను ప్రారంభిస్తానని వెల్లడించాడు.

 

మహేష్‌ బాబు ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత మహేష్ చేయబోయే సినిమా ఏంటన్నది ఇంకా క్లారిటీ రాలేదు. అయితే సుకుమార్‌తో అనుకున్న సినిమా మాత్రం క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ కారణంగా ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: