అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా 'అల వైకుంఠపురములో'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి రకరకాల వార్తలు రోజూ వినిపిస్తున్నాయి. అల వైకుంఠపురములో సినిమాను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాడు అల్లు అర్జున్. దీనికి ముందు వచ్చిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా డిజాస్టర్ కావటంతో ఈ సినిమాతో సూపర్ హిట్ సాధించి తిరిగి ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు. అందుకు తగ్గట్టుగా అల వైకుంఠపురములో సినిమాను సిద్ధం చేస్తున్నారు. కమర్షియల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరో సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. నివేదా పేతురాజ్, నవదీప్, టబు, జయరామ్, మురళీ శర్మ, సచిన్ ఖేడ్కర్, సునీల్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతమందిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై రాధకృష్ణ, అల్లు అరవింద్లు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డ్యూరేషన్ విషయంలో దర్శకుడితో నిర్మాత, హీరోలకు అభిప్రాయ బేధాలు వచ్చినట్టుగా గత కొన్ని రోజులుగా ఫిల్మ్ నగర్ సర్కిల్ లో ప్రచారం జరుగుతోంది. ఫైనల్ కాపీ రెడీ అయ్యాక సినిమా నిడివి దాదాపు 3 గంటల 5 నిమిషాలుగా వచ్చిందట. అయితే అల్లు అరవింద్, బన్నీలు మాత్రం సినిమా నిడివి 2 గంటల 45 నిమిషాలు ఉంటే బెటర్ అని త్రివిక్రమ్ కి సూచిస్తున్నారట.
అయితే బన్నీ చెప్పినట్టుగా సినిమాను ట్రిమ్ చేసేందుకు త్రివిక్రమ్ ససేమిరా అంటున్నాడన్న ప్రచారం జరుగుతోంది. అన్ని ఎలిమెంట్స్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయన్న త్రివిక్రమ్, ఇక మీ ఇష్టం అంటూ నిర్ణయాన్ని బన్నీకే వదిలేశాడట. దీంతో ఆలోచనలో పడ్డ బన్నీ ఎటూ తేల్చుకోలేకపోతున్నాడన్న టాక్ వినిపిస్తోంది. తన కెరీర్కు ఎంతో కీలకమైన సినిమా కావటంతో అల వైకుంఠపురములో విషయంలో బన్నీ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చి మంచి సక్సస్ ను అందుకున్నాయి. అందుకే అల తో ఇద్దరు హ్యాట్రిక్ హిట్ కోసం తపిస్తున్నారు.