టాలీవుడ్ లో ఎంతో మంది విలన్లు ఉన్నా అతి కొద్ది మంది మాత్రమే గుర్తింపు తెచ్చుకున్నవారిలో ఉన్నారు. పాత తరం లో రాజనాల, నాగభూషణం ఎంత గొప్ప పేరు సంపాదించారో తెలిసిందే. ఈ తరం విలన్లు గా బాలీవుడ్ నుంచి ఎక్కువ మంది విలన్లు ఎంట్రీ ఇస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్టర్ మూవీలో సైకో గా నటించిన సత్యప్రకాశ్ తర్వాత విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించాడు. కన్నడ భాషలో టాప్ విలన్లలో ఒకరిగా సత్య ప్రకాశ్ కి మంచి పేరు ఉంది. అప్పట్లో సాయి కుమార్ నటించిన పోలీస్ స్టోరీ సినిమాలో సత్యప్రకాశ్ విలనీజం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇలా ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించిన ఆయన కొన్ని సినిమాల్లో కామెడీ, క్యారెక్టర్ పాత్రల్లో నటించారు. కన్నడలో వరుస సినిమాలు చేస్తున్న ఆయన, తెలుగులో వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకుంటూ వెళుతున్నాడు.
ఇటీవల మెగాఫోన్ చేతబట్టి ఆయన దర్శకుడిగా మారిపోయాడు. ప్రస్తుతం నటవారసులు ఎక్కువగా సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మూవీతో సత్యప్రకాష్ కుమారుడు నటరాజ్ హీరోగా పరిచయం అవుతున్నారు. నూరిన్, అంకిత హీరోయిన్లు గా నటిస్తున్న ఈ మూవీ కి ఎ.గురురాజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా సత్య ప్రకాశ్ మాట్లాడుతూ.. తెరపైన కళ్లకి కట్టినట్టుగా కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. కానీ అవి నిజమా కాదా అనే ఆసక్తికరమైన విషయాలతో సాగే చిత్రమిది. డ్రాగన్ ప్రకాష్ ఫైట్స్, శేఖర్ మాస్టర్ నృత్యరీతులు ప్రధాన ఆకర్షణ.
మా అబ్బాయిని కథా నాయకుడిగా ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నా అన్నారు. ఈ సినిమాకి నేనే దర్శకుడిగా వ్యవహరించాను. సినిమా పిచ్చి వున్న ఓ కుర్రాడు, అందుకు అవసరమైన డబ్బుకోసం ఏం చేశాడనేదే కథ. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది అని చెప్పుకొచ్చాడు. తనను దర్శకుడిగా మార్చినందుకు నిర్మాత గురురాజ్కు రుణపడి ఉంటానని అన్నారు. ప్రేక్షకులను ఏమాత్రం నిరాశపరచనని హామీ ఇచ్చారు. ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించిన నూరిన్, అంకిత ఆకట్టుకొంటారని అన్నారు.