టాలీవుడ్లో ప్రతి ఏటా కొన్ని వందల సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. మరి సినిమా గురించి చెప్పుకోవాలంటే ముందుగా గుర్తొచ్చేది పాటలే. ఒక్కో సినిమాలో మూడు నుంచి ఐదారు పాటలు ఉంటాయి. సినిమాలో పాటలు ఎలా ఉన్నాయి అనే అంశం పైనే సినిమా ఓపెనింగ్స్ ఆధార పది ఉంటాయన్నది టాలీవుడ్ నమ్మకం. అయితే ప్రతి సినిమాలోని పాటలూ మనల్ని అలరించవు. కేవలం కొన్ని సినిమాల్లో పాటలు మాత్రమే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. సినిమా హిట్ అయినా ఫట్ అయినా.. అందులో పాటులు ప్రేక్షకులను ఆకట్టుకుంటే మాత్రం వాటిని ఎప్పటికీ మర్చిపోరు.
ఈ సంవత్సరంలో ఎన్నో హిట్టు పాటలు తెలుగు తెరను పలకరించాయి. వేగవంతమైన జీవితంలో రణగొణ ధ్వనులతో స్పీడు ఉన్న పాటల కంటే మెలోడీ పాటలే అందరి మనసులు దోచుకుంటున్నాయి. అలా ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులను బాగా అలరించిన టాలీవుడ్ టాప్ 5 సాంగ్స్పై ఓ లుక్కేసేయండి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం అల... వైకుంఠపురములో. ఈ చిత్రం ‘సామజవరగమన’ అంటూ సాగే ఈ పాటకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి అందించిన సాహిత్యం అద్భుతంగా ఉంటుందో.. సిద్ శ్రీరామ్ కూడా అంతే అద్భుతంగా ఆలపించారు.
అలాగే ఈ చిత్రం నుంచే `రాములో రాములా` అంటూ సాగే మాస్ బీట్ సాంగ్ను దీపావళి సందర్భంగా రిలీజ్ చేశారు. కాశర్ల శ్యాం రాసిన పాటను తమన్ సంగీత సారధ్యంలో అనురాగ్ కులకర్ణి, సత్యవతి (మంగ్లీ)లు ఆలపించారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్లో దుమ్మురేపుతోంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ల కాంబినేషన్లో తెరకెక్కిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమాలో ‘దిమాక్ ఖరాబ్’ సాంగ్ యువతను హోరెత్తించింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి ‘సూర్యుడివో చంద్రుడివో’ పాట అందరినీ ఆకట్టుకుంది. ఫ్యామిలీ ఎమోషన్స్తో విపరీతంగా వైరల్ అవుతోంది. అలాగే పెళ్లి తరవాత నాగచైతన్య, సమంత కలిసి నటించిన మొదటి చిత్రం మజిలి. ఇందులో "ప్రియతమా...ప్రియతమా... " అంటూ సాగే పాట బాగా హిట్ అవ్వడమే కాకుండా అందరి మనసులను దోచింది. ఇక మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన చిత్రలహరి సినిమాలో `ప్రేమ వెన్నెలా...రావె ఊర్మిళా` అంటూ సాగే పాట శ్రోతలను వీపరితంగా ఆకట్టుకుంది. ఈ పాటను శ్రీమణి రాయగా, సుదర్శన్ అశోక్ ఆలపించారు.