స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం `అల వైకుంఠపురములో..`. ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే హీరోయిన్గా నటించింది. టబు, రాజేంద్ర ప్రసాద్, సుశాంత్, నవదీప్ కీలక పాత్రలు పోషించారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించారు. బన్నీ, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి, జులాయి చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కావడంతో ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంతో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతోంది ఈ కాంబో.
అలాగే సంక్రాంతి తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ డైరెక్షన్ లో చేయనున్న తన 20వ సినిమా షూటింగ్ ప్రారంభిస్తారు. సుకుమార్ దర్శకత్వంలో చేయబోయే సినిమా ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కనున్నట్టు సమాచారం. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా కోసం బన్ని పూర్తిగా మేకోవర్ అవుతున్నట్టు సమాచారం. ఇక స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ రివెంజ్ డ్రామాని కూడా 2020 దసరా సీజన్ లో రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు.
అంతే కాదండోయ్.. అల్లు అర్జున్ 2020లో తన 21వ సినిమాని కూడా మొదలు పెట్టి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. సుకుమార్ షూట్ టైంలోనే అల్లు అర్జున్ తన తదుపరి స్క్రిప్ట్ ని లాక్ చేసి సమ్మర్ లో అధికారికంగా లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే ఐకాన్ సినిమాని అనౌన్స్ చేసి పక్కన పెట్టి ఉన్నారు. ఇలా వరుస సినిమాలతో బన్నీ అభిమానులకు 2020లో ట్రిపుల్ ట్రీట్స్ ఇవ్వనున్నారు. మరోవైపు సురేందర్ రెడ్డి, ఏఆర్ మురుగదాస్ లాంటి వారు కూడా క్యూ లైన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. మరి బన్నీ ఎవరికి గ్రీన్ సిగ్నెల్ ఇస్తారో చూడాలి. కాగా, అల్లు అర్జున్ ప్రస్తుతం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం అబ్రాడ్ వెళ్ళాడు. తిరిగి రాగానే `అల వైకుంఠపురములో` ప్రమోషన్స్ లో బిజీ అవ్వనున్నాడు.