సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "దర్బార్". ఈ సినిమాలో రజనీ ముంబయిలో ఒక పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నాడు. నయనతార హీరోయిన్ గా నటించనున్న ఈ చిత్ర్రం జనవరి 9 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి  విడుదల అవుతున్న ఈ చిత్రం ప్రమోషన్లలో తన జోరుని పెంచింది.

 

సంక్రాంతి బరిలో దిగిన ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఆ అంచనాలని మరింత పెంచడానికి చిత్ర్ర బృందం ప్రచారాన్ని పెంచింది. అసలే సంక్రాంతి అంటే తెలుగులో చాలా పెద్ద మార్కెట్. మార్కెట్ కి తగ్గట్టుగానే ఆ సమయంలో ఎన్నో పెద్ద సినిమాలు విడుదలకి రెడీగా ఉన్నాయి. మరి వాటన్నింటి మధ్య తమ స్పెషాలిటీ ఏంటనేది నిరూపించుకోవాలని అనుకున్నారో ఏమో..కానీ ప్రచారంలో వినూత్నంగా కనిపించారు.

 

తమ సినిమా పోస్టర్లని రోడ్ల మీద, బస్సుల మీద అంటించే వాళ్లని చూశాం కానీ ఏకంగా విమానాల మీదే ప్రమొషన్స్ చేయడం నిజంగా ఆశ్చర్యమే. దర్బార్ చిత్ర స్టిల్స్ ని విమానం ఎక్కించారు ఆ చిత్ర నిర్మాతలు. ప్రస్తుతం ‘దర్బార్’ సినిమాకు నాలుగు స్పైస్ జెట్ విమానాలను ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమోషన్స్ కోసం నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది.  గతంలో కూడా రజనీ చేసిన ‘కబాలి’ సినిమాకు ఎయిర్ ఏషియా విమానాల మీద ఇలాగే రజనీ స్టిల్స్ వేసి ప్రమోషన్స్ చేశారు.

 

ఇకపోతే ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక రేపు సాయంత్రం శిల్పకళా వేదికలో జరుగనుంది. ఈ చిత్రానికి సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం సమకూరుస్తున్నారు. నివేథా థామస్ మరో హీరోయిన్ గా కనిపించనుంది. మరి ప్రచారంలో వినూత్నంగా కనిపించిన ఈ సినిమా సంక్రాంతి బరిలో గెలుస్తుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: