సూపర్ స్టార్ రజనీకాంత్కు ఒకప్పుడు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈయన సినిమాలు వస్తున్నాయంటే థియేటర్ల ముందు భారీ స్థాయిలో క్యూలు కట్టిన రోజులూ ఉన్నాయి. వయసు మీదపడితే ఎవరైనా సినిమాల నుంచి రిటైర్ అవుతారు. తండ్రి, తాతా క్యారెక్టర్లకు పరిమితం అవుతారు. అయితే రజనీ కాంత్ విషయంలో మాత్రం అది రివర్స్ అవుతోంది. పై బడుతున్న వయసును లెక్క చేయకుండా తలైవా రజనీకాంత్ సినిమాల మీద సినిమాలు చేస్తూనే యువ హీరోలకు ఒకవైపు స్పూర్తిని ఇంకోవైపు పోటీని ఇస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఒకప్పుడు వచ్చిన శివాజీ సినిమా తెలుగులో 50 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. అప్పుడు ఓ డబ్బింగ్ సినిమాకు అంత పెట్టారని తెలుసుకొని ఆశ్చర్యపోయింది తెలుగు సమాజం.
ఆ తర్వాత రోబో సినిమా కూడా తెలుగులో భారీ రేటు పలికింది. కానీ ప్రస్తుతం రజనీకాంత్ సినిమాలకు అంత మార్కెట్ లేదు. వరుసగా ఫ్లాపులు వస్తుండడంతో సూపర్ స్టార్ మార్కెట్ అమాంతం పడిపోయింది. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న దర్బార్. సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ అవుతోంది. తెలుగులోనూ ఈ సినిమాను భారీగా ప్రమోట్ చేస్తున్నారు చిత్రయూనిట్. అయితే రిలీజ్ కు రెడీ అయిన దర్బార్ సినిమాను 30 కోట్ల రూపాయలకు తెలుగులో కొనుగోలు చేశారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అందులో వాస్తవం లేదు. కానీ.. అంతకంటే తక్కువగా కేవలం 14 కోట్ల రూపాయలకే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ అమ్ముడైనట్టు తెలుస్తోంది.
తిరుపతి ప్రసాద్ ఈ సినిమా రైట్స్ దక్కించుకున్నారు. నైజాంలో ఈ సినిమా 5 కోట్ల 20 లక్షలకు, సీడెడ్ లో 3 కోట్లకు, ఆంధ్రా ప్రాంతంలో 6 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. కాగా, రజనీకాంత్ గత చిత్రం పేట సినిమాకు హిట్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్లు రాలేదు. 13 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ ను కవర్ చేయడానికి నానా తంటాలు పడింది. ఈసారి మురుగదాస్ దర్శకుడు కావడంతో రేటు 2 కోట్లు అదనంగానే పలికింది. ఇక 14 కోట్ల 20 లక్షల రూపాయలకు అమ్ముడుపోయిన ఈ సినిమాకు సంక్రాంతి బరిలో కనీసం 15 కోట్ల రూపాయలు అయినా రాబట్టాలి. మరి దర్బార్ సినిమా ఎంత వరకు హిట్ అవుతోందో చూడాలి.