చంద్రముఖి చిత్రం కేవలం తమిళనాటకం మాత్రమే కాదు ఈ చిత్రం ప్రతిభాషలోనూ విడుదలై విజయఢంకా మోగించింది. 175 రోజులపాటు నిరంతరాయంగా తమిళనాడులో ఆడి సరికొత్త రికార్డును తన పేరిట రాసుకుంది. 890 రోజులపాటు ఈ చిత్రం చెన్నైలోని శాంతి థియేటర్లో నిరంతరాయంగా ఆడి అందరి చేత ‘ఔర.. ఔరా’ అనిపించుకుంది. ఇక ఇప్పటికీ చాలామంది నోట్లో రజనీకాంత్ చెప్పే ‘లకలకలకలక..’ డైలాగ్ నానుతూనే ఉంది. ఈ సినిమా ప్రధాన పాత్రల్లో తమిళ సూపర్స్టార్ రజనీకాంత్, నయనతార, జ్యోతిక, ప్రభు, నజీర్, వడివేలు నటించారు. ఈ సినిమా 2005లో విడుదలైన ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో చెక్కు చెదరకుండా నిలిచింది. సూపర్ డూపర్ హిట్ సాధించిన ఈ హారర్ మూవీకి సీక్వెల్ వస్తే బాగుండనేది ఎంతోమంది ప్రేక్షకుల కోరిక.
ఆ కోరిక ఎట్టకేలకు నెరవేరే సమయం ఆసన్నమైనట్టు తెలుస్తోంది. గత కొంత కాలంగా సోషల్ మీడియాలో చంద్రముఖి 2 రానుందన్న వార్తలు ఓ ఊపు ఊపేస్తున్నాయి. ఈ క్రమంలో తమిళ దర్శకుడు పి.వాసు మాటలు దీనికి మరింత ఊతమిస్తున్నాయి. చంద్రముఖి సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన పి.వాసు దానికి సీక్వెల్ తీస్తున్నానని ప్రకటించాడు. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ దాదాపుగా సిద్ధమైనట్టేనని ఆయన పేర్కొన్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థతో ఈ సినిమాకోసం సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. అయితే సీక్వెల్లో రజనీకాంత్ కనిపిస్తారా, లేదా అన్న విషయాన్ని మాత్రం ఆయన దాటవేశారు. త్వరలోనే నటీనటులను వెల్లడించనున్నారు.
ఈ చిత్రం చాలా అరుదైన సన్నివేశాలు ... ‘రాజాధిరాజ.. రాజమార్తాండ.. రాజ గంభీర.. రాజ కులతిలక.. వేంకటపతిరాజ.. బహుపరాక్, బహుపరాక్’ ఈ కూతలోనే ఎక్కడలేని రాజసం, ఠీవీ. రాజు కన్నుపడితే ఏదైనా సొంతం కావాల్సిందే. దక్కకపోయిందో.. అది బూడిద కావాల్సిందే. ఈ క్రమంలో రాజు కన్నేసిన చంద్రముఖి తనకు దక్కలేదన్న కోపంతో సజీవ దహనం చేస్తాడు. ఆ తర్వాతి కాలంలో ఆత్మగా మారిన చంద్రముఖి ఎన్ని సమస్యలను సృష్టించింది.. ఆ చంద్రముఖిని ఎలా అంతం చేశారన్నది మిగతా కథ. అటు కామెడీ, ఇటు హారర్ రెండింటిరీ బ్యాలెన్స్ చేస్తూ సాగుతుందీ చిత్రం.