సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం `దర్బార్`. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్తో, హైటెక్నికల్ వాల్యూస్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను తెలుగులోనూ భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్న చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా అదే స్థాయిలో నిర్వహిస్తున్నారు. రజినీ.. ఆదిత్య అరుణాచలంగా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించిన ఈ సినిమాను అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కించినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. జిల్లా కేంద్రమైన కృష్ణగిరితో పాటు కావేరి పట్టణంలో హీరో రజనీకాంత్ నటించిన దర్బార్ సినిమా ప్రత్యేక ప్రదర్శనను రద్దు చేస్తున్నట్టు కృష్ణగిరి డీఎస్పీ భాస్కర్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో ఆదివారం ఆయన పోలీసు అధికారులు, రజనీకాంత్ అభిమాన సంఘాల ప్రతినిథులు, కృష్ణగిరి, కావేరిపట్టణం థియేటర్ల యజమానులతో సమావేశం నిర్వహించి మాట్లాడినట్టు తెలుస్తోంది. కొన్ని నెలలకు ముందు విజయ్ నటించిన బిగిల్ సినిమా ప్రత్యేక ప్రదర్శనలో జరిగిన విధ్వంసాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో ఇక్కడున్న మొత్తం పది థియేటర్లలో ఏ హీరో సినిమాలు ప్రత్యేక ప్రదర్శనకు అనుమతినిచ్చేది లేదని స్పష్టం చేశారు.
ఈ క్రమంలోనే రజనీకాంత్ దర్బార్ మూవీ అక్కడ స్పెషల్ షో రద్దు అయినట్టు తెలుస్తోంది. కాగా, ఈ సినిమా స్పెషాలిటీ ఏమిటి అంటే 1992లో పాండ్యన్ అనే సినిమా తర్వాత రజనీకాంత్ మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత పోలీస్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రజనీకాంత్ సరసన చంద్రముఖి సినిమాతో హిట్ పెయిర్ గా గుర్తింపు పొందిన నయనతార నటిస్తున్నారు. ఇక ఈ సినిమా కథకి సంబంధించినంత వరకూ ఇది ఒక రివేంజ్ స్టోరీ అని సినిమా లవర్స్ ప్రచారం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలియాలంటే జనవరి 9 వరకు వెయిట్ చేయాల్సిందే.