టాలీవుడ్ జేమ్స్ బాండ్ గా పేరు తెచ్చుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ చేసిన సాహసాలు అన్నీ ఇన్నీ కావు.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఫైట్స్, సీఐడీ, జేమ్స్ బాండ్ లాంటి సినిమాలతో ఆయన ఎన్నో ప్రయోగాలు చేశారు. ఒకరకంగా చెప్పాలంటే తెలుగులో ఫైట్స్ అంటే హీరో కృష్ణ అనే ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్నారు. ఇక కృష్ణ వారసుడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు బాలనటుడిగా వెండి తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో ‘రాకుమారుడు’ మూవీతో హీరోగా పరిచయం అయ్యాడు. తండ్రికి తగ్గ తనయుడుగా మహేష్ బాబు నటనతో పాటు ఫైట్స్, కామెడీ లో తనదైన మార్క్ చాటుకున్నాడు.
పోకిరి సినిమా తర్వాత మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు, భరత్ అనే నేను మూవీస్ లో మెసేజ్ ఓరియెంటెడ్ తో క్లాస్, మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. గత ఏడాది వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ‘మహర్షి’ మూవీలో రైతుల కోసం పోరాటం చేసే యువకుడి పాత్రలో నటించారు. ఈ మూవీ కూడా మంచి విజయం అందుకోవడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో నటిస్తున్నారు. అయితే ఈ మూవీలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దాదాపు పదిహేనేళ్ల తర్వాత లేడీ అమితాబ్ విజయశాంతి ఈ మూవీలో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.
ఈ మూవీలో మరో ప్రత్యేకత కూడా ఉందట... సూపర్ స్టార్ కృష్ణ ఒక ప్రత్యేక పాత్రలో నటించినట్టు దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పారు. వయసు పైబడిన కారణంగా కొంతకాలంగా సినిమాలకి దూరంగా వుంటున్నారు. కృష్ణ ఎంట్రీ సెకండాఫ్ లో ఉంటుందనేది తాజా సమాచారం. సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ లో భాగంగా ఆయన కనిపిస్తారని అంటున్నారు. మొత్తానికి కీలకమైన పాత్రతో విజయశాంతి రీ ఎంట్రీ .. ప్రత్యేక పాత్రలో కృష్ణ కనిపించనుండటం.. ప్రత్యేక గీతంలో తమన్నా మెరవనుండటం ఈ సినిమాలో అన్నీ ప్రత్యేకతలు కనిపిస్తున్నాయి.