సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కన్నడ బ్యూటి రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన తాజా సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా 11 న రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. మహర్షి వంటి సూపర్ హిట్ తర్వాత మహేష్ అలాగే ఎఫ్ 2 వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి కలిసి చేసిన ఈ సినిమాని ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. ఇక 13 ఏళ్ళ తర్వాత లేడి సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాతో రీ ఎంట్రీ కూడా సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా మహేష్ బాబు-విజయశాంతి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్-పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన సినిమా 'అల వైకుంఠపురములో'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో లో తెరకెక్కిన ఈ హ్యాట్రిక్ సినిమాపై ముందునుంచి ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా 'అల వైకుంఠపురములో' సినిమా బన్ని-త్రివిక్రమ్ లకు హ్యాట్రిక్ సినిమా. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి వచ్చి మంచి సక్సస్ ని అందుకున్నాయి. దాంతో మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అనగానే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. దానికి తోడు అల నుంచి థమన్ ఇచ్చిన పాటలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఇవన్ని ఇప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ అవడానికి బాగా దోహదపడ్డాయి. 12 న విడుదలైన ఈ సినిమా సంక్రాంతి రేసులో ముందు నిలిచింది. మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.
అందుకే తమ సినిమా సంక్రాంతి విన్నర్ అని ప్రకటించుకుంది అల వైకుంఠపురంలో యూనిట్. మీడియాకు ఇచ్చే యాడ్స్ లో 'సంక్రాంతి విన్నర్' అంటూ తమ సినిమాకు ట్యాగ్ తగిలించి సినిమాని ఇంకా ప్రమోట్ చేసుకుంటున్నారు. అయితే ఆ ట్యాగ్ కు కౌంటర్ గా మరో ట్యాగ్ ను వదిలారు 'సరిలేరు చిత్ర యూనిట్. మొదటి రోజు తమ సినిమా సూపర్ హిట్ అని ప్రకటించుకున్న ఈ సినిమా టీం ఇప్పుడు తమ సినిమాకు ట్యాగ్ లైన్ మార్చారు. 'రియల్ సంక్రాంతి విన్నర్' అంటూ ఈ సినిమాకు ఇప్పుడు ఈ ట్యాగ్ ను తగిలించారు. రిలీజ్ డేట్ తో సహా దాదాపు అన్నీ విషయాల్లో ఈ రెండు సినిమాల మధ్యన పోటీ బాగా ఉంది. ఇప్పుడు ట్యాగ్ లు, కౌంటర్ ట్యాగ్ లతో రెండు సినిమాల వాళ్లూ తమ పోటీ ఉందన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు.