ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాల్లో నటించేందుకు పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యాడు. ఆ విధంగా రెండు పడవల మీద కాళ్ళు వేసి ముందుకు వెళ్తున్నాడు. తాజాగా పింక్ రీమేక్ తో పవన్ రీ ఎంట్రీ ఇచ్చి మొదటి రోజు షూటింగ్ దిగ్విజయంగా పూర్తి చేశాడు. ఈ సందర్భంగా పవన్ సెట్స్ లో నడుస్తున్న స్టిల్స్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ముందుగా అనుకున్న ప్రకారం మొన్న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం వరకు షూటింగ్ సాగింది. దీంతో షెడ్యూల్ ప్రకారం సినిమా ముందుకు వెళుతుందని నిర్మాత దిల్ రాజు సంతోషంలో ఉండగానే.. రెండో రోజు షూటింగ్ కు హాజరుకాకుండా పవన్ షాక్ ఇచ్చాడు. 


రాజకీయాల్లో బిజీ అయిపోయిన కారణంగా పవన్ మళ్లీ సెట్స్ పైకి ఎప్పుడు వస్తాడో తెలియని పరిస్థితి ఏర్పడింది. మొదటిరోజు సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత అమరావతి చేరుకున్న పవన్ అక్కడి రైతులతో భేటీ అయ్యారు. ఆ తర్వాత రోజు ఉదయమే హఠాత్తుగా ఢిల్లీకి వెళ్లారు. ఇక అక్కడే కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ను కలిశారు. నిన్న బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తో భేటీ అయ్యారు. ఇలా పవన్ రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో పింక్ రీమేక్ షూటింగ్ కు ఎప్పుడు వస్తారు అన్న విషయం ఆ సినిమా నిర్మాత దిల్ రాజు సైతం క్లారిటీ లేకుండా పోయింది. దీంతో ఆయనకు ఖర్చు బాగా పెరిగిపోతుందంటూ తన సన్నిహితుల దగ్గర గగ్గోలు పెడుతున్నాడట.


 షూటింగ్ కోసం పవన్ విజయవాడ నుంచి హైదరాబాద్ కు తీసుకు వచ్చేందుకు కూడా దిల్ రాజు ఏర్పాటు చేశారు. దాదాపు నెల రోజుల కిందటే ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో సెట్ వేశారు. దీంతో స్టూడియో అద్దె తో పాటు మిగతా అన్నిరకాల అద్దెలు పెరిగిపోవడంతో దిల్ రాజుకి భారంగా మారిపోవడంతో పాటు  ఈ సినిమాలో నటించే మిగతా ఆర్టిస్ట్ ల కాల్షీట్స్కి కూడా ఇబ్బంది ఏర్పడిందట. దీంతో పవన్ తో అనవసరంగా సినిమా స్టార్ట్ చేశానా అనే బాధ దిల్ రాజులో కనిపిస్తోందట.

మరింత సమాచారం తెలుసుకోండి: