కంగన రనౌత్ ..బాలీవుడ్ లో సంచలనమైనహీరోయిన్ గా కొనసాహుతోంది. ఆమె ఏం మాట్లాడినా, సినిమా చేసినా సంచలనమే, ఎలాంటి పాత్ర చేసినా సంచలనమే. మొండి ధైర్యంతో ఆమె తెర వెనక ఎలాంటి కామెంట్స్ చేసినా అవీ సంచలనమే అవుతాయి. రాం గోపాల్ వర్మ తర్వాత మళ్ళీ ఏదో ఒక వివాదంలో నిరంతరం వినిపించే పేరు కంగనాదే. తన 14 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో పాత్రలు చేసింది. ఉత్తమ నటిగా ఇప్పటికే చాలాసార్లు జాతీయ పురస్కారాలు సొంతం చేసుకుంది. అంతేకాదు ఇప్పుడు పద్మశ్రీ గౌరవం కూడా కంగనా కి దక్కడం గొప్ప విశేషం. ప్రముఖ పర్యాటక ప్రదేశం మనాలి దగ్గర బాంబ్లా అనే ఊళ్లో పుట్టి కంగన తండ్రి అమరదీప్ వ్యాపారి... తల్లి ఆశ స్కూల్ టీచర్. ఇక కంగన మోడలింగ్ చేస్తూనే థియేటర్ ఆర్ట్స్పై దృష్టి పెట్టింది. అప్పటి నుంచే బాలీవుడ్ లో సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అందులో భాగంగా ముంబాయిలో ప్రయత్నిస్తున్న సమయమలో దర్శకుడు అనురాగ్ బసు కంటపడటం ఆ తరువాత ‘గ్యాంగ్స్టర్’ సినిమా ఆడిషన్స్లో పాల్గొనడం ఆ సినిమాలో సెలెక్ట్ అవడం వెంట వెంటనే జరిగిపోయాయి.
మొదటి సినిమాతోనే బాలీవుడ్ ఇండస్ట్రీని బాగా ఆకట్టుకుంది కంగన. ఆ తరువాత వరసగా సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. ‘లైఫ్ ఇన్ ఎ మెట్రో’, ‘ఫ్యాషన్’ తదితర చిత్రాలతో విజయాలు అందుకొంది. ‘ఫ్యాషన్’లో ప్రియాంక చోప్రాతో కలిసి నటించింది. ఈ సినిమాలో నటనకుగానూ ప్రియాంకకి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు దక్కితే, ఉత్తమ సహనటిగా కంగనా జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకొంది. ‘ఫ్యాషన్’ తరువాత..‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబయి’, ‘తను వెడ్స్ మను’, ‘తను వెడ్స్ మను రిటర్న్స్’, ‘షూట్ అవుట్ ఎట్ వాదాలా’, ‘క్రిష్3’, ‘క్వీన్’ - ఇలా ప్రేక్షకుల్ని అలరించిన ఎన్నో చిత్రాల్లోనూ, పాత్రల్లోనూ నటించింది. ఇక కంగన తెలుగులో ప్రభాస్తో కలిసి ‘ఏక్ నిరంజన్’లో నటించింది. పూరి జగన్నాధ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. వాస్తవంగా మహేష్ బాబు హీరోగా పూరి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మువీ పోకిరి తోనే టాలీవుడ్ ఎంట్రీ జరగాల్సింది. అది మిస్సయింది. ఈ విషయంలో కంగన ఇప్పటికీ బాధపడుతుంటుంది.
ఇక 2019 గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదలైన ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ కంగనకి ఎంతో పేరు తెచ్చి పెట్టింది. తెలుగు దర్శకుడు క్రిష్తో కలసి కంగన తెరకెక్కించిన సినిమా అని చెప్పక తాదు. ఈ సిన్మాలో ఝాన్సీ లక్ష్మిబాయ్గా కంగన అద్భుతంగా ఆకట్టుకుంది. మరో తెలుగు దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి తెరకెక్కించిన ‘మెంటల్ హై క్యా’ సినిమాతోనూ కంగన నటించి మెప్పించింది. ఇక రీసెంట్ గా రిలీజైన ‘పంగా’ సినిమాతో మరోసారి నటిగా తన సత్తాని చాటిచెప్పింది. ప్రస్తుతం జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘తలైవి’లో ప్రధాన పాత్రలో నటిస్తోంది కంగన. ‘తను వెడ్స్ మను’, ‘క్వీన్’ చిత్రాలకు ఉత్తమ నటిగా జాతీయపురస్కారాల్ని అందుకుంది. కంగనలో రచయిత్రి కూడా ఉంది. ఆమె నటించిన ‘క్వీన్’, ‘సిమ్రన్’ సినిమాలకి సంభాషణలు రాయడంలోనూ తనేంటో నిరూపించుకుంది. ఇక త్వరలో పూర్తి స్థాయి దర్శకురాలిగా మారబోతున్న కంగనకి తాజాగా పద్మ శ్రీ పురస్కారం దక్కడం ఎంతో గొప్ప విషయం.