నటసింహ బాలకృష్ణ హీరోగా గత ఏడాది సంక్రాంతి సందర్భంగా వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలతో పాటు ఇటీవల ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రూలర్ కూడా ఘోరంగా పరాజయం పాలవడంతో బాలయ్య కొంత ఆలోచనలో పడ్డారు. అందుకే తనకు గతంలో సింహా, లెజెండ్ వంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన బోయపాటి శ్రీనుకి తన తదుపరి సినిమా అవకాశం ఇవ్వడానికి సిద్ధం అయిన బాలయ్య, ఇటీవల మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా, బోయపాటి దర్శకత్వంలో సినిమాను కూడా షురూ చేసారు. 

 

అయితే ఈ సినిమా ఫిబ్రవరిలో రెగ్యులర్ షూట్ ఫిక్స్ చేశారన్న ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారానికి పూర్తిగా చెక్ పెట్టేసేలా తాజాగా మరో ఆసక్తికర సంగతి తెరపైకి వచ్చింది. ఈ ప్రాజెక్ట్ విషయంలో ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందనేది ఇన్ సైడ్ టాక్. బాలయ్య ఇంకా స్క్రిప్టును రివ్యూలు చేస్తున్నారని తెలుస్తోంది. బాల‌య్య అనుకున్న మేర‌కు క‌థ రాలేద‌ట‌. బోయపాటి ప్రస్తుతం స్క్రిప్టుపై రీవర్క్ చేస్తున్నారు. దీని విషయంలో అన్నిరకాలుగా జాగ్రత్త పడుతున్నారట. కారణం ఏదైనా బాలయ్య సహనాన్ని మాత్రం బోయపాటి అండ్ రైటర్ల టీమ్ కొంత పరీక్షిస్తూనే ఉన్నారని అర్థమవుతోంది. ఇన్ని నెలలు గా స్క్రిప్ట్ లాక్ చేయకపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగించేదే. 

 

ఈసారి స్క్రిప్టు చదివాక, బాలయ్యకు అంత నమ్మకం బోయపాటి మీద కలగడం లేదా, అందుకేనా ఈ వెయిటింగ్? అంటూ ఓ సెక్షన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి ఇటు బాలయ్యతో పాటు అటు బోయపాటికి కూడా ప్రస్తుతం హిట్ ఎంతో ఆవశ్యకం. గతంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఆయన తెరకెక్కించిన జయ జానకి నాయకా పర్వాలేదనిపించినా, ఇటీవల రామ్ చరణ్ తో ఆయన తీసిన వినయ విధేయ రామ అత్యంత ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అందుకే ఈ సినిమా కథ, కథనాల విషయంలో బోయపాటి మరింత జాగ్రత్త వహిస్తున్నట్లు చెప్తున్నారు. సో, దీనిని బట్టి వీరిద్దరి కాంబోలో రాబోతున్న మూవీ సెట్స్ పైకి వెళ్ళడానికి మరికొంత సమయం పడుతుందన్నది అర్ధం అవుతోంది. మరి ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాలంటే మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: