గతంలో ఎన్నడూ లేని విధంగా సూపర్‌ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్‌లు ఈ సంక్రాంతి బరిలో ముఖాముఖి తలపడిన విషయం తెలిసిందే. సినిమాల రిలీజ్‌ల కన్నా ముందు నుంచే ఈ ఇద్దరు హీరోలు ప్రకటనలతో వేడి పెంచారు. అసలు రిలీజ్‌ డేట్‌ విషయంలోనే పెద్ద హైడ్రామా నడిచింది. ముందే ఏ సినిమా రిలీజ్‌ అవుతుందన్న ఉత్కంఠ సస్పెన్స్‌ థ్రిల్లర్ మతలపించింది.

 

చివరకు ఒక్క రోజు గ్యాప్‌తో మహేష్‌ బాబు సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్‌ అల వైకుంఠపురములో సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రెండు సినిమాలకు పాజిటివ్‌ టాక్‌ రావటంతో బాక్సాఫీస్ మీద కనకవర్షం కురిసింది. దీంతో రెండు చిత్రాల యూనిట్లు సైలెంట్ అవుతాయని భావించారు. కానీ అసలు కథ అక్కడే మొదలైంది. రిలీజ్‌ ముందు ఢీ అంటే ఢీ అన్న హీరోలు, సినిమాల రిలీజ్‌ తరువాత కూడా స్థాయిలో ఒకరితో ఒకరు సై అన్నారు.

 

ఫస్ట్ డే కలెక్షన్ల రికార్డ్‌తో మొదలైన పోటి ఫస్ట్ వీకెండ్‌, నాన్‌ బాహుబలి రికార్డ్, ఇండస్ట్రీ వరకు కోనసాగింది. అయితే ఈ ప్రచారం విషయంలో మహేష్ కన్నా బన్నీ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉన్నాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా సాధించిన ప్రతి రికార్డ్‌ను 24 గంటలు కూడా కాక ముందే బ్రేక్ చేసినట్టుగా ప్రకటిస్తూ వచ్చాడు బన్నీ. దీంతో మహేష్, బన్నీ అభిమానుల మధ్య కూడా సోషల్‌ మీడియా వార్‌ ఊపందుకుంది.

 

అయితే సినిమా పూర్తయిన వెంటనే ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లటం మహేష్‌కు అలవాటు. ఆ అలవాటే మహేష్‌ను ప్రమోషన్‌లో వెనకపడేలా చేసింది. బన్నీ వరుస ప్రెస్‌మీట్‌లు పార్టీలతో మీడియాలో సందడి చేస్తుంటే మహేష్ మాత్రం హ్యాపిగా ఫ్యామిలీతో విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పటికే రెండు సక్సెస్‌మీట్‌లతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు, టాలీవుడ్‌ దర్శకులకు ప్రత్యేకంగా పార్టీ ఇచ్చాడు బన్నీ. దీంతో అలవైకుంఠపురములో సినిమా వార్తలు మీడియాలో రెగ్యులర్‌గా కనిపిస్తున్నాయి. దీంతో కలెక్షన్లు కూడా కాస్త గట్టిగానే వస్తున్నాయన్న టాక్ వినిపిస్తోంది.

 

మహేష్‌ మీడియాకు దూరంగా ఉండటంతో వసూళ్ల మీద కూడా ప్రభావం కనిపిస్తోందంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. అడపాదడపా నిర్మాతలు ప్రెస్‌మీట్‌లు పెడుతున్నా స్టార్‌ వాల్యూ లేకపోవటతో ఆశించిన స్థాయిలో రెస్పాన్స్‌ రావటం లేదనది ఇండస్ట్రీ టాక్‌. మరి ఇప్పటికైన పరిస్థితి అర్థం చేసుకొని మహేష్ మీడియా ముందుకు వస్తాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: