ప్రేమ అభిమానాన్ని చిన్న చిన్న భావోద్వేగాల్ని వెండితెరకెక్కించి కిక్కెక్కించగల అద్భుతమైన దర్శకుడు సుకుమార్. ఆయనకి లెక్కలు తెలుసు. లెక్కల్లో ఇమిడిపోగల బతుకులు తెలుసు. అటు గణితాన్ని, ఇటు జీవితాన్ని కలగలిపి కలర్ ఫుల్గా కళ్ళాపి జల్లి తెరపై రంగురంగుల రంగవల్లికలు అద్దగల సృజనాత్మ కలిగిన దర్శకుడు సుకుమార్. వన్సైడ్ ప్రేమికుల పక్షాన నిలిచి...వారి హృదయ స్పందనని ‘ఆర్య’గా మలచినా ... బావమరదళ్ళ సరస సల్లాపాల్ని ‘100 పర్సెంట్ లవ్’గా తీర్చి దిద్దినా, మనం మరిచిపోతున్న మన పల్లె సీమలను ఒకసారి ‘రంగస్థలా’న్ని మనముందుకు తెచ్చినా...ఆ లెక్కల మాస్టారికే చెల్లుతుంది. దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా తెలుగు సినిమా పరిశ్రమకు సేవలు అందించిన ఘనత ఆయన సొంతం. ఆ ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్.
సుకుమార్ ఇండస్ట్రీలోకి రాక ముందు లెక్చరర్. కాకినాడలోని ఆదిత్య విద్యా సంస్థల్లో లెక్కల మాస్టారుగా పనిచేస్తారు. అందుకే సుకుమార్కి లెక్కల మాస్టార్ అనే పేరు వచ్చింది. అతని సొంత ఊరు తూర్పుగోదావరిజిల్లాలో రాజోలు కోనసీమలో ఉంటది. కాకినాడ నల్లమలి శేషారెడ్డి ఆదిత్య కాలేజ్లో పనిచేశారు. అక్కడి నుంచి ఇండస్ట్రీకి వచ్చి వి.వి. వినాయక్ దగ్గర అసిస్టెంట్గా పని చేశాడు. దిల్రాజు దిల్ సినిమాకి కూడా పని చేశాడు.
‘డర్’, ‘కభీ హా కభీ నా’, సినిమాలలో కథానాయికకు కథానాయకుడు తన ప్రేమను సినిమా చివరిలో చెబుతారు. ఈ ఆలోచనని పాతదని సుకుమార్ భావించారట. అందుకే ‘ఆర్య’ సినిమాలోని తాను ప్రేమించిన అమ్మాయికి తన ప్రేమని మొదట్లోనే చెప్పేటటువంటి కథాంశాన్ని ఎంచుకొన్నారట. ఆ కథకు ఇంప్రెస్ అయిన దిల్ రాజు ఆ ప్రాజెక్టుని పట్టాలెక్కించడానికి ముందుకొచ్చారు. రవితేజ, నితిన్, ప్రభాస్ పేర్లను పరిశీలించిన తరువాత అల్లు అర్జున్ని కథానాయకుడిగా ఎంచుకొన్నారు. చనిపోయిన తన తండ్రి గౌరవార్ధం ‘నాన్నకు ప్రేమతో’ సినిమా తెరకెక్కించాలని నిర్ణయించుకొన్నారు సుకుమార్. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఇది జూనియర్ ఎన్టీఆర్కి 25వ సినిమా. తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి భావోద్వేగపు బంధాన్ని చూపించే కథగా తెరకెక్కిన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా 2016 జనవరి 13న రిలీజ్ అయింది.