తెలుగు లో విద్యా విజ్ఞాన వినోద కార్యక్రమాల కొరకు అనేక టీవీ ఛానళ్ళు ఉన్నాయి. అందులో జెమినీ టీవీ కూడా ఒకటి. అయితే తెలుగు వెండితెరపై అద్భుత విజయాన్ని అందుకున్న కొన్ని హిట్ సినిమాల తాలూకా శాటిలైట్ హక్కులను ఈ మధ్య కాలంలో ఎక్కువగా కొనుగోలు చేసిన ఛానెల్ ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా జెమిని టీవీయే అని చెప్పాలి. వాస్తవానికి గతంలో అయితే కేవలం జెమినీ టీవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ మాత్రమే సినిమా హక్కులను స్వంతం చేసుకునేది. ఆ తర్వాత ఈటీవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ రావడంతో పోటీ మొదలైంది. ఇక మాటీవీ ఎంట్రీతో పోటీ రసవత్తరంగా మారగా, జీ టీవీ అడుగు పెట్టడంతో ఈ పోటీ తారాస్థాయికి చేరింది.
కానీ, గత కొన్ని నెలల నుంచి మాత్రం జెమినీ ఛానెల్ వారు ఆ అవకాశాన్ని ఇతర ఛానెల్స్ కు ఇవ్వడం లేదు. ఇటీవల వచ్చిన సినిమాల్లో దాదాపు చాలా సినిమాల శాటిలైట్ హక్కులను సొంతం చేసేసుకొని వాటిని టెలికాస్ట్ చేసెయ్యడం కూడా అయ్యిపోయింది. మరి ఈ సినిమాలు ఏంటో పరిశీలిస్తే.. మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ‘అల.. వైకుంఠపురంలో’ సంక్రాంతి కానుకగా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ దక్కించుకోవడం కోసం ప్రముఖ టీవీ ఛానెల్స్ పోటీ పడగా.. చివరకు జెమినీ టీవీ సొంతం చేసుకుంది.
అదే విధంగా, మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ `డిస్కో రాజా`, యంగ్ హీరో నటించిన క్రైమ్ థ్రిల్లర్ `అశ్వథ్థామ` శాటిలైట్ రైట్స్నూ జెమినీ టీవీనే సొంతం చేసుకుంది. వీటితో పాటు సమంత అక్కినేని, శర్వానంద్ జంటగా ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన సినిమా జాను మరియు ప్రేమికుల రోజు సందర్భంగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రాంతిమాధవ్ దర్శకత్వంలో వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా శాటిలైట్ హక్కులను కూడా జెమినీ టీవీనే దక్కించుకుంది. సో.. మరి కొన్ని రోజుల్లో ఈ కొత్త సినిమాలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి రెడీ అయింది జెమినీ టీవీ.