మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మకుటం లేని మహరాజు. అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్గా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో N.T.రామారావు తరువాత ఆ స్థాయిలో అభిమానించదగ్గ నటుడు మెగాస్టార్ చిరంజీవి అంటే అతిశయోక్తి కాదు. అభిమానులు ఆప్యాయంగా అన్నయ్య అని పిలిచినా.. బాక్సాఫీస్ యముడికి మొగుడు అయినా.. రికార్డుల గ్యాంగ్ లీడర్ అయినా అన్నీ ఈయనే. ఇక ఎంత మంది హీరోలు వచ్చినా వెళ్లినా మెగాస్టార్ అంటే టాలీవుడ్కి ఎవరెస్ట్ శిఖరం అనే చెప్పాలి.
ఈ శిఖరాన్ని అందుకోవాలని ఆయన ఫ్యామిలీ నుండే అర డజన్కి పైగా హీరోలు వచ్చినా ఆయన వేసిన బాటలో నడవగలుగుతున్నారే తప్ప.. ఈ బహుదూరపు బాటసారిని అందుకోవడం ఎవరితోనూ సాధ్యం కాలేదు. 1978లో చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చాడు. ఆయన నటించిన తొలి సినిమా ప్రాణం ఖరీదు. అప్పటికే పునాది రాళ్లు మొదలైనా కూడా తొలి విడుదల మాత్రం ప్రాణం ఖరీదే. చిరంజీవిని ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమా కూడా ఇదే. ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేసి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పర్చుకున్నాడు చిరంజీవి. అయితే ఒకానొక దశలో వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న చిరంజీవికి `ఇంద్ర` సినిమా మంచి విజయాన్ని అందించింది.
బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ 2002 సంవత్సరంలో నిర్మించారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్లు నటించారు. ఈ సినిమాలోనూ డైలాగ్స్ ఇప్పటికీ చాలా మంది చెబుతుంటారు. `వీరశంకర రెడ్డి, మొక్కే కదా అని పీకేయాలని చూస్తే, పీక కోస్తా`.. `సింహాసనం పై కూర్చుండే హక్కు అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్ర సేనా రెడ్డి ది` ఇలా ఈ చిత్రంలోని డైలాగ్స్ చాలా పాపులర్ అయ్యాయి. వాస్తవానికి వరుస ఫ్లాపులతో చిరంజీవి కెరీర్ ముగిసిపోతోంది అన్న సమయంలో ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాక, అప్పట్లోనే ఈ చిత్రం దాదాపు 30 కోట్ల పై చెలుకు షేర్ రాబట్టి ఘన విజయం సాధించింది. ఇలా ఎన్నో రికార్డులు బద్దలుకొట్టిన ఈ చిత్రం చిరంజీవిని వెండితెర మారాజుగా నిలబెట్టింది.