టాలీవుడ్ లో హీరో రామ్ పోతినేని నటించిన ‘నేను శైలజ’ సినిమాతో పరిచయం అయ్యింది మాలీవుడ్ బ్యూటీ కీర్తి సురేష్. ఆ తర్వాత హీరో నాని నటించిన ‘నేను లోకల్’ సినిమాతో మరో విజయం అందుకుంది. ఇలా నటించి చెండు సినిమాలు హిట్ టాక్ రావడంతో యువ దర్శకుడు నాగ్ అశ్విన్ దృష్టిలో పడింది. ఎప్పటి నుంచో ఆయన మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ఓ మూవీ తీయాలనే ఆలోచలో ఉన్నారు. అదే సమయంలో కీర్తి సురేష్ ని కలవడం.. ఈ మూవీ గురించి చెప్పడం జరిగిందట. ఆ తర్వాత కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో.. సమంత, విజయ్ దేరకొండ ముఖ్య పాత్రల్లో ‘మహానటి’ తెరకెక్కించారు నాగ్ అశ్విన్.
ఈ మూవీలో అలనాటి అందాల తార సావిత్రి రూపంతో అందరినీ అబ్బుర పరిచింది కీర్తి సురేష్. ఈ మూవీ తెలుగు, తమిళంలో సూపర్ హిట్ అయి మంచి కలెక్షన్లు రాబట్టింది. ఆ తర్వాత కీర్తి సురేష్ తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో నటిస్తూ వస్తుంది. బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటే ప్రయత్నం చేస్తుంది. ఎక్కువగా తమిళ్ మూవీస్ లో నటిస్తుండటంతో.. తెలుగులో కాస్త గ్యాప్ వచ్చింది. తెలుగులో హీరోయిన్ పాత్రలో ఆమె 'మిస్ ఇండియా' సినిమాను మాత్రమే అంగీకరించి, ఆ సినిమా చేస్తూ వెళ్లింది.
సురేంద్రనాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి తాజాగా విడుదల తేదీని ఖరారు చేశారు. ఏప్రిల్ 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. మహిళలపై జరిగే అకృత్యాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కొనేరు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు చిన్నగా స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు.