లెజండరీ డైరెక్టర్ కమ్ యాక్టర్ విజయనిర్మల కాంస్య విగ్రహం ఇటీవలె ఆమె ఫిబ్రవరి 20న ఆమె పుట్టినరోజు సందర్భంగా నానక్రామగూడలో ఉన్న తన ఇంట్లో ఆవిష్కరించారు. తన తల్లి విజయనిర్మలపై తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్నారు నటుడు వీకే నరేష్. భర్త కృష్ణ విజయనిర్మల కాంశ్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే, తల్లికి ప్రేమతో అంటూ నరేష్ ఆమెకు ఏకంగా బంగారు పాదాలు చేయించాడు. నానక్ రామ్ గూడలోని కృష్ణ-విజయనిర్మల నివాసంలో విజయనిర్మల కాంస్యవిగ్రహాన్ని, ఆ విగ్రహం ముందు ఆమె బంగారు పాదాల్ని ఆవిష్కరించారు.
తనకు తల్లే సర్వస్వం అని చెప్పుకునే వీకే నరేష్.. ఆమె రూపంతో పాటు.. ఆమె పాదాల్ని రోజూ దర్శించుకోవడం తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. అందుకే బంగారు పాదాలు చేయించుకున్నానని అశృనయనాలతో చెప్పుకున్నారు. నరేష్ చేయించిన బంగారు పాదాల గురించి మహేష్ ప్రస్తావించకపోయినా.. నటుడు కృష్ణంరాజు మాత్రం ప్రస్తావించారు. ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులంటే అభిమానం ఉంటుందని, నరేష్ ఇలా తన తల్లికి బంగారు పాదాలు చేయించి పూజించడం గొప్ప విషయం అన్నారు.
అలాగే నరేష్ మాట్లాడుతూ... అమ్మ నాకు ఎప్పుడూ ఒక మాట చెపుతుండేది. ఎప్పుడూ అందరితో కలిసి ఉండు అని చెప్పేది. అలాగే అమ్మకి తన పుట్టిన రోజు జరుపుకోవడం ఆ వంకతో అందరిని చూడటం ఆమెకు ఎంతో ఇష్టం. అందుకనే ఈ కార్యక్రమాన్నిజరుపుతున్నాము. అలాగే ఎప్పుడూ అమ్మ ఒకటే చెప్పేది పది మంది మంచి మనుషుల్ని దగ్గరికి తీసుకో అలాగే చెడు ఉంటే దాన్ని మర్చిపోయి వాళ్ళని దగ్గరికి తీసుకో అందరూ మనవాళ్ళే అంటూ ఆఖరి రోజు వరకు చెప్పేది. సింహాసనాలు, భుజకీర్తిలకు పోవద్దు నీకు నేనున్నాను నీకంతా మంచి జరుగుతుంది అంటూ ఎప్పుడూ ధైర్యం చెప్పి పంపించేది. ఈ వేదిక ఈ రోజు అమ్మకు ఒక మాత్రు పూజ అన్నారు. అలాగే నాకన్నా కూడా అమ్మకు మహేష్ అంటే చాలా ఇష్టం అని అన్నారు.