సాహసికుడు బేర్ గిల్స్తో కలిసి సూపర్ స్టార్ రజనీకాంత్ సాహసాలు ఎలా ఉండబోతున్నాయి..? బందిపుర టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో వారు చేసిన అడ్వంచర్స్ ఏంటి ? మ్యాన్ వర్సెస్ వైల్డ్ పేరిట ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్ కోసం రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మ్యాన్ వర్సెస్ వైల్డ్ . డిస్కవరీ ఛానల్ లో ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్స్ ఇప్పటికే వరల్డ్ ఫేమస్. తాజాగా సూపర్స్టార్ రజినీకాంత్, బేర్ గిల్స్ యాక్షన్ ప్యాక్డ్ ఎపిసోడ్స్ టీజర్ విడుదలైంది. వీటిని ప్రసారం చేయబోతున్న డిస్కవరీ ఛానల్ ఈ టీజర్ను ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో ఈ సాహసకృత్యాలను చిత్రీకరించారు. దీనికి సంబంధించిన యాక్షన్ సీన్స్ తలైవా ఫ్యాన్స్కు కనువిందు చేయబోతున్నాయి.
నెరిసిన గడ్డం.. కూలింగ్ గ్లాసెస్, లెదర్ జాకెట్తో క్లోజప్ షాట్లో సూపర్స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ ను మెస్మరైజ్ చేస్తున్నారు. కర్ణాటకలోని చామరాజ నగర జిల్లా బండీపూర్ అభయారణ్యం, పులుల సంరక్షణా కేంద్రంలో గత నెల 28వ తేదీ నుంచి ఈ అడ్వెంచర్ ఎపిసోడ్ లను చిత్రీకరించారు. మ్యాన్ వర్సెస్ వైల్డ్ టీజర్ను ట్విట్టర్లో షేర్ చేసిన కొన్ని నిమిషాల్లోనే లక్షలాది మంది వీక్షించారు. రజినీ ఫైర్, జోష్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఎపిసోడ్ లను మనదేశంలో చిత్రీకరించడం ఇది రెండోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బేర్ గ్రిల్స్తో గత ఏడాది మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఎపిసోడ్లను చిత్రీకరించారు. ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో మోడీతో దీనికి సంబంధించిన సన్నివేశాలను షూట్ చేశారు. సరిగ్గా ఏడాది తిరిగేలోపే మరోసారి డిస్కవరీ ఛానల్ మనదేశానికే వచ్చింది. దక్షిణాది సూపర్స్టార్ రజినీని తన లేటెస్ట్ ఎపిసోడ్ల కోసం ఎంపిక చేసింది.
ఈ ఎపిసోడ్ షూటింగ్ సమయంలో రజనీకాంత్కు గాయాలయ్యాయి. దీంతో ఒకరోజు పాటు షూటింగ్ను వాయిదా వేసుకున్నారు. ఈ తరహా రియలిస్టిక్ అడ్వెంచర్ డాక్యుమెంటరీలో రజినీకాంత్ కనిపించడం ఇదే తొలిసారి. దీంతో తలైవా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఉత్సాహంలో ఉన్నారు. మార్చి 23 రాత్రి 8 గంటలకు డిస్కవరీ ఛానల్లో ఈ కార్యక్రమాలు ప్రసారం అవుతాయి.