పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వేణు శ్రీరాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న కోర్ట్ డ్రామా మూవీ వకీల్ సాబ్ లో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని ఆయనతో కలిసి బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ బోనీ కపూర్ కూడా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ ని సంపాదించింది. ఈ సినిమా నుండి థమన్ స్వరపరిచిన మగువ మగువ అనే పల్లవితో సాగె సాంగ్ ని మహిళా దినోత్సవం కానుకగా రేపు యూట్యూబ్ లో విడుదల చేయనున్నారు. 

 

మరో వైపు ఈ దీనితో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఏఎమ్ రత్నం నిర్మిస్తున్న పీరియాడికల్ మూవీ షూటింగ్ లో కూడా పవన్ పాల్గొంటున్నారు. ఆ సినిమా కోసం ఇటీవల కొన్ని భారీ సెట్స్ కూడా సిద్ధం చేసిన యూనిట్, ప్రస్తుతం ఆ సెట్స్ లో వేగంగా షూటింగ్ ని జరుపుతున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ మాదిరిగా ఒక పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్న ఆ సినిమాని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ రెండు సినిమాల తరువాత గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తో కలిసి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై పవన్ ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. 

 

ఇటీవల ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ ఏడాది దసరా సమయంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాలో హీరోయిన్ గా కెజిఎఫ్ భామ శ్రీనిధి శెట్టి ఎంపికైనట్లు నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి వార్తలు అందుతున్నాయి. ఇప్పటికే కెజిఎఫ్ చాప్టర్ 2 తో పాటు తమిళ్ లో విక్రమ్ సరసన కోబ్రా సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తున్న శ్రీనిధి, తన సినిమాలోని పాత్రకు సరిగ్గా సరిపోతుందని భవించిన దర్శకుడు హరీష్ ఆమెను ఎంపిక చేసారని, మరొక వారం రోజుల్లో ఆమెను కలిసి సినిమాకు సంబంధించి కథ చెప్పి, అగ్రిమెంట్ చేసుకోనున్నారని టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజం అయితే, శ్రీనిధి రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే...!!

మరింత సమాచారం తెలుసుకోండి: