నేడు హొలీ పండగ సందర్బంగా ప్రజలంతా పండగ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం కరోనాకు భయపడి హొలీ రంగులు వెదజల్లుకోవడం ఈ ఏడాది కాస్త తక్కువనే చెప్పుకోవాలి. అయినప్పటికీ హోలీ జోష్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. అలాగే టాలీవుడ్ యంగ్ టైగర్ కూడా హోలీ సంబరాలు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. వాస్తవానికి సినిమా షూటింగులతో నిరంతరం ఎంతో బిజీగా ఉండే జూనియర్ ఎన్టీఆర్... తన కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తాడు. షూటింగ్ స్పాట్ కు కూడా తన భార్య, పిల్లలను అప్పుడప్పుడు తీసుకొస్తుంటాడు.
ఇక తాజాగా హోలీ పండగ సందర్భంగా తన భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్లతో కలిసి దిగిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో తారక్ షేర్ చేశాడు. ఈ క్రమంలోనే 'అందరికీ హోలీ శుభాకాంక్షలు` అని కూడా ఎన్టీఆర్ తెలియజేశాడు. ఆ ఫోటోలో వైట్ అండ్ వైడ్ డ్రెస్లో అందరూ ముఖానికి రంగులు పూసుకుని హోలీ పండగను చాలా ఆనందంగా జరుపుకున్నారు. ఇక ఎన్టీఆర్ పిల్లలు చాలా క్యూట్ కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.
అయితే దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం ఎన్టీఆర్ ఫ్యామిలీ పిక్ లో ఓ ప్రత్యేక విషయాన్ని గమనించారు. ఈ ఫోటోపై దర్శకుడు హరీష్ శంకర్ స్పందిస్తూ .. 'చిన్నవాడు కెమెరా వైపు చూస్తున్న విధానం ఏదో చెబుతుంది.. వదిలితే ఇప్పుడే దూకేసేలా ఉన్నాడు. లిటిల్ టైగర్.. వస్తున్నాడు'. అంటూ కామెంట్ చేశారు. వాస్తవానికి భార్గవ్ రామ్ ని చూస్తుంటే శంకర్ చెప్పింది నిజమే అనిపిస్తోంది. రెండేళ్లు కూడా నిండని ఆ బుడతడు కెమెరాని పేస్ చేయడం బాగా ఎట్రాక్టింగ్ కనిపిస్తుంది. ఇక శంకర్ చేసిన కామెంట్స్కు ఎన్టీఆర్ అభిమానులు సైతం ఎంతో ఆనందంగా స్పందిస్తున్నారు.