వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రముఖ సినీనటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ పార్టీలో ఎంత వేగంగా ఎదిగారో అంతే వేగంగా పడిపోయారు. వైసీపీ గెలుపు కోసం, జగన్ను సీఎం చేసేందుకు ఎంతో కష్టపడ్డ ఆయనకు జగన్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్వీబీసీ చైర్మన్ పదవి ఇచ్చారు. పృథ్వి పదవిలోకి వచ్చిన ఆరేడు నెలలకే ఆయనపై రాసలీలల ఆడియో ఆరోపణలు రావడంతో ఆయన్ను జగన్ పదవి నుంచి తప్పించేశారు. ఇక ఆయనకు టీటీడీ చైర్మన్ వైవి. సుబ్బారెడ్డికి మధ్య ఆధిపత్య పోరులోనే పృథ్వి బలయ్యారన్న టాక్ కూడా ఉంది. సీఎం జగన్ ఆదేశాల మేరకు ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని పృథ్వీరాజ్ను టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ఆదేశించడంతో పృథ్వి పదవి నుంచి వైదొలగక తప్పలేదు.
ఇక ఆదివారం ఓ ప్రముఖ ఛానెల్ కార్యక్రమంలో పోసాని నన్ను ఎందుకు టార్గెట్ చేశాడో ? తెలియదని చెప్పారు. పోసానితో నాకు వృత్తిపరమైన శత్రుత్వం మాత్రమే ఉంది. ఆయనకు నేను ఏం అన్యాయం చేశానో నాకే తెలియదు... ఆయన నాపై ఆరోపణలు చేశారని వాపోయారు. తాము ఇప్పటకీ మంచి మిత్రులమే అని. ఎక్కడ కనపడినా అన్నయ్యా బాగున్నావా అంటే ? బాగున్నాను తమ్ముడు అని పిలుస్తారని పృథ్వి చెప్పారు. ఇక తాను రాజధాని రైతుల విషయంలో అన్న మాటలకు ఇప్పటకీ కట్టుబడి ఉన్నాను.... నేను రాజధానిలో వ్యవసాయం చేసుకునే రైతుల గురించి విమర్శించ లేదన్నారు.
తాను కేవలం కార్పొరేట్ ముసుగులో రైతుల పేర్లు చెప్పుకుంటున్న వారి గురించే అన్నానని పృథ్వి చెప్పారు. ఇక తనకు రాజకీయాలు.. తెర వెనక తతంగాలు తెలియవని... అలా చేసి ఉంటే వైసీపీలో ఈ పాటికే మంత్రి అయ్యేవాడిని అని పృథ్వి చెప్పారు. ఏదేమైనా పోసాని వల్లే తన ఎస్వీబీసీ ఛానెల్ చైర్మన్ పదవి పోయిందన్న విషయాన్ని మరోసారి చెప్పిన పృధ్వి తన అసంతృప్తి వ్యక్తం చేశారు.