దేశ వ్యాప్తంగా ఇప్పుుడు కరోనా కష్టాలు మొదలయ్యాయి. సామాన్యుల జీవితాలు ముఖ్యంగా దినసరి కూలీ చేసుకొని జీవితం గడిపే వారి పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి ప్రభావంతో సినీ పరిశ్రమకు ఎక్కువ కష్టాలొచ్చి పడ్డాయి. ఈ పరిశ్రమను నమ్ముకొని ఎంతో మంది జీవనం కొనసాగిస్తున్నారు. గత కొన్ని రోజులుగా షూటింగ్స్ అన్నీ క్యాన్సల్ చేశారు. చివరికి బుల్లితెర సీరియల్స్ కూడా క్యాన్సిల్ చేశారు. కరోనా అదుపులోకి వచ్చే వరకు మళ్లీ షూటింగ్ మొదలు పెట్టకూడదని నిర్ణయం తీసుకున్నారు సినీ పెద్దలు. ఇప్పుడు సినీ పరిశ్రమకు చెందిన జూనియర్ ఆర్టిస్టులు ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వాళ్లు రోజులు గడవడం కష్టంగా ఉందని వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కొంత మంది సినీ ప్రముఖులు మేమున్నామని ముందుకు వస్తున్నారు. ఇప్పటికే నిర్మాతలు కొంత మంది సినీ పరిశ్రమలో పనిచేసే వారికి చేయూత ఇస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పటికే జీవితా రాజశేఖర్ దంపతులు పదిరోజుల వరకు సరిపడ సహాయాన్ని కొంత మందికి అందించారు. నితిన్ పదిలక్షల రూపాయలు విరాళం ప్రకటించారు. మరికొంత మంది ఇదే బాటలో నడుస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో భాషాభేదాలతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా అన్ని సినిమాల షూటింగ్లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఆయా భాషల్లోని సినీ పరిశ్రమకు చెందిన వారు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు.
దినసరి వేతనాలపై ఆధారపడే సినీ కార్మికులు ఇబ్బందులను పడుతున్న వారికి చేయూతనిస్తున్నారు. తాజాగా తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్ దక్షిణ భారత ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్కు యాభైలక్షల విరాళాన్ని అందజేశారు. ఆయన బాటలో విజయ్ సేతుపతి పదిలక్షల విరాళం ప్రకటించారు. ఇప్పటికే హీరోలు సూర్య, కార్తి ఈ ఫెడరేషన్ పదిలక్షలు అందజేశారు. వారి బాటలోనే మరికొందరు స్టార్స్ సినీ కార్మికులను ఆదుకునేందుకు సిద్ధమవుతున్నారు.