'ధడక్' సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్కు సౌత్ సినిమాలపై ఆసక్తి లేదనే వార్తలు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో స్టార్ హీరోల పక్కన అవకాశం వచ్చినా.. ఆ ఆఫర్స్ అన్నింటిని తిరస్కరిస్తోందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో శ్రీదేవి కి ఎంత పేరు ఉందో అందరికీ తెలుసు. ముద్దుముద్దు మాటలు, వడివడి అడుగులతో చిన్న వయసులోనే కళామతల్లి ఒడికి చేరిన నటి శ్రీదేవి అన్నది తెలిసిందే. ఇండియాలోని అన్ని సినీ ఇండస్ట్రీలో దాదాపు స్టార్ హీరోలందరి పక్కన నటించిన శ్రీదేవి భారతీయ సినిమా చరిత్రలో తనకంటూ ఒక పేజీ క్రియేట్ చేసుకుంది. అయితే ప్రమాదవశాత్తు దుబాయిలో బాత్ రూమ్ లో కాలుజారి పడి చనిపోవడం జరిగింది. ఆమెకు ఇద్దరు కూతుళ్లన్న విషయం తెలిసిందే. అయితే వారిని యాక్టర్స్ గా చూడడానికి శ్రీదేవి మొదట్లో ఇష్టపడలేదు. అందుకేనేమో తన పెద్ద కూతురు జాన్వీకపూర్ హీరోయిన్గా నటించిన తొలి చిత్రాన్ని చూడకుండానే ఈ లోకాన్ని వీడింది.
ఏదేమైనా శ్రీదేవి వారసురాలు జాన్వీకపూర్ హీరోయిన్ అయిపోయింది. హిందీలో పలు చిత్రాలతో బిజీగా ఉంది. అయితే అతిలోకసుందరి కూతురు జాన్వీ కపూర్ని టాలీవుడ్ కి తీసుకురావాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. దక్షిణాది చిత్రాల్లో నటించాలన్న ఆసక్తిని వ్యక్తం చేసిన జాన్వీకపూర్ తెలుగులో విజయ్దేవరకొండతో రొమాన్స్ చేసే అవకాశం వస్తే నటించడానికి సిద్ధం అని ఒక ఇంటర్వ్యూలో కూడా పేర్కొంది. విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ సినిమాలో జాన్వీ దాదాపు ఖాయమని అప్పట్లో వార్తలొచ్చాయి. కానీ ఆమె డేట్స్ కారణంగా సెట్ అవ్వలేదు. ఈ మధ్య మరో పెద్ద నిర్మాత జాన్వీని కలిశారని టాక్. అయితే జాన్వీ మాత్రం తెలుగు సినిమా చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేయలేదట. తనకు పారితోషికం నచ్చలేదా అంటే అదీ లేదు. హిందీ సినిమాకి తీసుకునే పారితోషికమే ఆఫర్ చేశాడట నిర్మాత.
కానీ జాన్వీ మాత్రం ఆ అవకాశాన్ని వద్దనుకుందట. తెలుగు సినిమాల్లో కథానాయిక పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదని, కేవలం గ్లామర్ డాళ్గానే చూపిస్తారని, పైగా ఇక్కడ హీరోలు, దర్శకుల డామినేషన్ ఎక్కువని తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పేసిందట జాన్వీ. దాంతో సదరు నిర్మాత ఖంగుతున్నాడని టాక్. జాన్వీ చేసిన హిందీ సినిమాలు ఫక్తు కమర్షియల్ బాపతు సినిమాలే. అలాంటిది.. తెలుగు సినిమా చేయమంటే వంకలు వెదకడం ఏమిటని సదరు నిర్మాత ఆశ్చర్యపోయాడని టాక్. జాన్వీ అనే కాదు, చాలా మంది బాలీవుడ్ భామలకు తెలుగు సినిమాలపై ఇప్పటికీ ఇదే అభిప్రాయం ఉంది. తెలుగులో కథానాయికలు భారీ పారితోషికాలు అందుకుంటున్నా, ఇక్కడ హీరోలతో పాటుగా సమానమైన స్థాయి, క్రేజ్ అందుకుంటున్నా – అవేమీ ముంబై భామలకు కనిపించడం లేదు. జాన్వీ ఈ టైపులో ఆలోచిస్తే.. తను ఎప్పటికీ తెలుగు సినిమానే చేయకపోవొచ్చు. ఈ విషయం తెలిసిన శ్రీదేవి అభిమానులు తల్లిని ఆదరించిన టాలీవుడ్ ని తక్కువ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు.