కోలీవుడ్ సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా 2005లో వచ్చిన సినిమా చంద్రముఖి. వాస్తవానికి అంతకముందు వరకు ఎక్కువగా పూర్తిగా యాక్షన్, మాస్ కథాంశాలతో కూడిన సినిమాలు చేస్తూ వచ్చిన రజిని, ఈ సినిమా ద్వారా తొలిసారిగా హర్రర్ సినిమా చేసారు. స్టార్ హీరోయిన్ నయనతార కోలీవుడ్ కి ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. పి వాసు దర్సకత్వంలో శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో అత్యద్భుత విజయాన్ని అందుకోవడంతో పాటు పలు ఏరియాల్లో పెద్ద రికార్డ్స్ ని కూడా నమోదు చేసింది. ఇటు తెలుగు లోను డబ్ కాబడిన ఆ సినిమా ఇక్కడ కూడా హిట్ కొట్టి రజిని క్రేజ్ ని మరింతగా పెంచింది. 

 

ముఖ్యంగా సినిమాలో రజిని, ప్రభు, నయనతార నటనతో పాటు చంద్రముఖిగా జ్యోతిక అత్యద్భుత నటన సినిమాకు ఎంతో ప్రాణంగా నిలిచింది అనే చెప్పాలి. విద్యాసాగర్ సంగీతం, శేఖర్ వి జోసెఫ్ ఫోటోగ్రఫి తో పాటు ఆద్యంతం ఆకట్టుకునే, కథనాలతో, సస్పెన్స్ అంశాలతో రూపొందిన ఈ సినిమాకు సీక్వెల్ ని, ఆ తరువాత తీద్దాం అని భావించారు దర్శకుడు పి వాసు. అయితే కొన్ని కారణాల వలన అది కుదరకపోవడంతో, ఆపై చంద్రముఖి కి కొనసాగింపుగా అప్పట్లో విక్టరీ వెంకటేష్ నాగవల్లి తీయడం జరిగింది. అయితే ఆ సినిమా మాత్రం అంచనాలు అందుకోలేక ఘోరంగా ఫ్లాప్ అయింది. ఇక ఎట్టకేలకు చంద్రముఖికి అసలైన సీక్వెల్ చంద్రముఖి2 రాబోతోంది అంటూ డాన్సర్, దర్శకుడు, నటుడు అయిన రాఘవ లారెన్స్ నేడు తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తెలియపరిచారు. 

 

ఇటీవల రజిని సార్ తో కలిసి చంద్రముఖి 2లో నటించడానికి ఒప్పుకున్నాను. పి వాసు గారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ గారు ఎంతో భారీగా నిర్మించనున్నారు అంటూ లారెన్స్ ట్వీట్ చేసారు. అయితే నిర్మాతల నుండి పుచ్చుకున్న అడ్వాన్సుతోనే తాను మొత్తంగా మూడు కోట్లరూపాయలు కరోనా బాధితులకు విరాళంగా ఇస్తున్నట్లు లారెన్స్ ప్రకటించారు. ఇక లారెన్స్ నోట చంద్రముఖి 2 తెరకెక్కబోతోంది అనే న్యూస్ బయటకు రాగానే రజిని ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తప్పకుండా రజినీకి ఆ సినిమా మరొక హిట్ ని అందిస్తుందని వారు సంబరంతో సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: