దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుండటంతో టాలీవుడ్ డైరెక్టర్లు ఈ సమయాన్ని తమ స్క్రిప్ట్ పనులు కంప్లీట్ చేసుకోడానికి ఉపయోగించుకుంటున్నారు. కరోనా లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే వీరు తమ చిత్రాలతో బిజీ కానున్నారు. కానీ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి మాత్రం ఇంకా తన నెక్స్ట్ సినిమా ఫైనలైజ్ చేయలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబుకి 'మహర్షి'లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత కూడా ఇన్ని రోజులు తన తదుపరి ప్రాజెక్ట్ పట్టాలెక్కించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వాస్తవానికి వంశీ పైడిపల్లి 'మహర్షి' సినిమా తర్వాత మళ్ళీ మహేష్ తోనే గ్యాంగ్ స్టర్ కథాంశం నేపథ్యంలో సినిమా చేయబోతున్నాడని అప్పట్లో వార్తలొచ్చాయి. 'మహర్షి' సూపర్ హిట్ కావడంతో వంశీ పైడిపల్లి నెక్స్ట్ ప్రాజెక్ట్ కి కూడా మహేష్ ఒకే చెప్పారు. ఇక 'సరిలేరు నీకెవ్వరు' తరువాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లాల్సి వుంది. కానీ ఏమి జరిగిందో తెలియదు గాని.. మహేష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం డైరెక్టర్ పరశురామ్ ని లైన్లో పెట్టినట్లు న్యూస్ వచ్చింది. దీనితో మహేష్ - వంశీ పైడిపల్లి మూవీ ఇప్పట్లో లేనట్టే అని ప్రచారం జరుగుతుంది.

 

ఇటీవల రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' తర్వాత తన ప్రాజెక్ట్ మహేష్ బాబుతో అని ప్రకటించడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది చివర్లో లేదా 2022 ప్రారంభంలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. మరి ఈ గ్యాప్ లో మహేష్ ఒక్క సినిమా కంటే ఎక్కువ చేయలేడు. పరుశురాంతో మూవీ అంటున్నారు కాబట్టి అది 2021లో విడుదల అవుతుంది. నెక్స్ట్ రాజమౌళి సినిమాలో జాయిన్ కావలసిన మహేష్ మరో సినిమాను ఒప్పుకొనే అవకాశం లేదు. రాజమౌళితో సినిమా అంటే ఎప్పుడు స్టార్ట్ అవుద్దో ఎప్పుడు కంప్లీట్ అవుద్దో చెప్పలేని పరిస్థితి. కాబట్టి నిజంగా మహేష్ బాబుపై ఆశలు పెట్టుకొని స్క్రిప్ట్ కి మెరుగులు దిద్దుతున్నట్లైతే వంశీ ఆ తర్వాత ఇబ్బందుల్లో పడే అవకాశముంది. వంశీ పైడిపల్లితో రాజమౌళి సినిమా కంటే ముందు మహేష్ సినిమా చేయని పక్షంలో వీరి ప్రాజెక్ట్ ఎప్పుడో చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలా రాజమౌళి - సూపర్ స్టార్ కాంబోలో సినిమా పప్రకటించి వంశీ పైడిపల్లి ఆశలపై నీళ్లు చల్లినట్లు అయ్యింది.

 

ఈ నేపథ్యంలో వంశీ పైడిపల్లి పలువురు అగ్ర హీరోలకు కథలు వినిపించినా ఏదీ ఫైనలైజ్ కాలేదు. అందులోను ప్రస్తుతం స్టార్ హీరోలందరూ నెక్స్ట్ సినిమాలు అనౌన్స్ చేసి బిజీగా ఉన్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ తో సినిమా ఓకే చేసాడు.. అల్లు అర్జున్ సుక్కు సినిమా తర్వాత సురేందర్ రెడ్డితో చేయనున్నాడు.. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా పట్టాలెక్కించనున్నాడు. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో వంశీ పైడిపల్లి సినిమా చేయబోతున్నట్లు వార్త బయటకి వచ్చింది. కానీ చరణ్ ఆర్.ఆర్.ఆర్ మరియు ఆచార్య సినిమాలతో బిజీగా ఉండబోతున్నాడు. దీంతో వీరి కాంబినేషన్ కుదిరే అవకాశం తక్కువే అని భావించవచ్చు. అంటే స్టార్ హీరోలందరూ మరో ఏడాది దాకా ఖాళీగా ఉండే అవకాశమే లేదని చెప్పవచ్చు. మరి రాబోయే రోజుల్లో వంశీ పైడిపల్లి ఎవరితో సినిమా చేయాలని నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: