చిరంజీవి నటిస్తున్న భారీ చిత్రం `ఆచార్య`కు మళ్లీ భారీ షాక్ తగిలినట్టు సమాచారం. ఇంతకీ ఏమా షాక్ అసలు ఆ గొడవేంటి అనుకుంటున్నారా... అదేనండి కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రారంభ దశ నుంచే ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది. కారవాన్ల వివాదం కారణంగా తొలి రోజుల్లో ఈ సినిమా పై పెద్ద రచ్చే జరిగింది. ఆ తరువాత కీలక అతిథి పాత్ర విషయంలోనూ నాన్నా పులి తరహాలో డ్రామానే నడిచింది. కాసేపు సూపర్స్టార్ మహేష్ అని మరి కాసేపు రామ్చరణ్ మరి కాసేపు వేరొకరి పేరు ఇలా రక రకాల పేర్లు వినపడ్డాయి.
అయితే ఫైనల్గా మాత్రం ఈ చిత్రంలో 30 నుంచి 40 నిమిషాల నిడివిగల కీలక అతిథి పాత్రని రామ్చరణ్ చేత చేయించాలనుకున్నారు. అయితే అందుకు రాజమౌళి `ఆర్ ఆర్ ఆర్` అడ్డంకిగా మారడంతో ఆ స్థానంలో మహేష్ని తీసుకోవాలని సంప్రదింపులు కూడా జరిపారు. రెమ్యునరేషన్ భారీగా కోట్ చేయడంతో ఆ ప్రయత్నాన్నిమళ్ళీ తిరిగి విరమించుకున్నారు. ఆ తరువాత ఇందులో హీరోయిన్గా చిరుకు జోడీగా నటించాల్సిన త్రిష క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ చిత్రం నుంచి తప్పుకుంటున్నానని బహిరంగంగా ప్రకటించడం కూడా ఓ పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ఆ తరువాత హీరోయిన్గా అనుష్కని సంప్రదించారు. తను అంగీకరించకపోవడంతో చివరికి కాజల్ని తీసుకున్నారు. తాజాగా `ఆచార్య` టీమ్కు కాజల్ కూడా షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అవును చందమామ కూడా చిరుకి షాక్ ఇచ్చిందట. కాజల్ చేతిలో ప్రస్తుతం నాలుగు చిత్రాలున్నాయి. అవి ఇంకా చిత్రీకరణ దశలోనే వున్నాయి. కరోనా కారణంగా వాటి షెడ్యూల్స్ మారబోతున్నాయట దీంతో ఆమె కూడా ఇందులో నటించడం కష్టమే అంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వాటిని పక్కన పెట్టి `ఆచార్య`కు డేట్స్ కేటాయించడం కష్టం. కాబట్టి ఈ సినిమా నుంచి తప్పుకోవాలని కాజల్ భావిస్తోందట. మరి ఫైనల్గా దీని కోసం ఎవరు ఫిక్స్ అవుతారో చూడాలి మరి.