మెగాస్టార్ చిరంజీవి - శ్రీదేవి నటించిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' విడుదలై 30 ఏళ్ళైన సందర్భంగా ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ మూడు స్టోరీలని అభిమానులతో పంచుకోనున్నట్టు వైజయంతి మూవీస్ అశ్వినీదత్ తెలిపారు. ఇప్పటికే అందులో మొదటి రెండు స్టోరీలను నాని వాయిస్ ఓవర్‌ తో వీడియో విడుదల చేసారు. ఇప్పుడు నాని వాయిస్‌ ఓవర్‌ లో వచ్చిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' మూడో స్టోరీ విడుదల చేసారు.

 

 

''జగదేక వీరుడు అతిలోక సుందరి.. మాములు సినిమా కాదు. మరి దాని రిలీజు మాములుగా ఎలా ఉంటది.. 1990 మే 9న జగదేక వీరుడు అతిలోక సుందరికి రిలీజ్‌ డేట్ ఫిక్స్‌ చేశారు. అప్పట్లో అతి పెద్ద బడ్జెట్‌తో నిర్మించారు ఈ చిత్రాన్ని. అప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు సెన్సేషన్‌ క్రియేట్ చేశాయి. అన్నీ సరిగ్గా కుదిరాయి అన్న సమయానికి మే 6వ తేదిన తుఫాను వార్తలు మొదలయ్యాయి. భారీ వర్షాల దెబ్బకి ఎక్కడి రైళ్లు అక్కడ ఆగిపోయాయి. చెట్లు, కరెంట్ స్థంబాలు కూలిపోయి రాష్ట్రం మొత్తం అతలాకుతలమైంది. ప్రింట్స్‌ పంపడం ఎలా..? మరోవైపు రిలీజ్‌ ఆగకూడదు. దీంతో తుఫాన్‌ను ఎదిరించి థియేటర్లలో సినిమాను విడుదల చేశారు. అయితే భారీ వర్షాలతో పలు థియేటర్లలోకి, ప్రొటెక్టర్ రూమ్‌లోకి నీళ్లు కూడా పోయాయి. ఎన్నో అంచనాలతో తెరకెక్కించిన ఈ సినిమా నీటి పాలవుతుందని, చేసిన ప్రమోషన్లు వరద నీళ్లలో కొట్టుకుపోతాయని అశ్వనీదత్ ఆలోచించారు. ఏదేతేనేం జరిగేది జరుగుతుంది. తరువాత జరగాల్సినది చూడాలి అనుకుంటూ అశ్వనీదత్, రాఘవేంద్ర రావు విజయవాడ వెళ్లారు.

 

విజయవాడ వెళ్లగానే.. రాఘవేంద్ర రావును ఓ హోటల్‌లో ఉంచిన అశ్వనీదత్, తన ఇంటికి వెళ్లారు. ఇంట్లో కరెంట్ లేకపోగా.. ఓ చిన్న లాంతర్ వెలుగులో దత్ కుటుంబ సభ్యులు భోజనం చేస్తున్నారు. ఇంట్లో చీకటి.. దత్ మనసులో చీకటి. ఇదే తన ఆఖరు సినిమా అవుతుందేమోనని అశ్వనీదత్ అన్నారట. వెంటనే ఆయన తండ్రి ధర్మరాజు గారు.. ఏం పర్లేదు మంచి సినిమా తీశావు. సెటిల్ అవుతావు అని చెప్పారట. మరుసటి రోజు రాఘవేంద్రరావుతో కలిసి దత్.. గుంటూరులోని ఓ థియేటర్‌కు వెళ్లారట. అక్కడ పరిస్థితి వేరేలా ఉంది. క్లాస్ ఆడియెన్స్‌ మాస్ ఆడియెన్స్‌లా రెచ్చిపోతున్నారు. చప్పట్లు, ఈలలతో గోలగోలగా ఉండటాన్ని చూసి సినిమాపై చిన్న తృప్తి తెనాలి వెళ్లారు. అప్పుడు మరో మరుపురాని సంఘటన జరిగింది.

 

ఎన్టీఆర్ అప్పట్లో ప్రతిపక్ష హోదాలో ఉండగా.. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటన చేస్తూ వారికి ఎదురుపడ్డారు. ఆ సందర్భంగా సినిమా రిపోర్ట్‌ బావుంది. సెటిల్ అయిపోతావు. కంగారు పడకు. నేను చెప్తున్నా అని ధైర్యం చెప్పి తన ప్రోగ్రామ్‌లోకి వెళ్లిపోయారు. ఆ మాటలు విని ధైర్యంతో కారు ఎక్కబోతుంటే.. సైకిల్‌పై అరటి పళ్లతో అటుగా వచ్చిన ఓ వ్యక్తి ఇప్పుడే సినిమా చూశాను. అదిరిపోయింది. సంవత్సరం ఆడుతుంది అని గట్టిగా అరిచాడట. దీంతో దత్, రాఘవేంద్రరావు గట్టిగా ఊపిరి పీల్చుకున్నారట. ఇక అక్కడి నుంచి ఈ సినిమా తన బీభత్సాన్ని చూపించింది. తుఫాను, వర్షం ఏవీ జగదేక వీరుడు అతిలోక సుందరిని ఆపలేకపోయాయి. తెలుగు సినిమా చరిత్రలో తుఫానుగా వచ్చిన ఈ చిత్రం వచ్చి 30 ఏళ్లు కాగా.. కొన్ని అనుమానాలు ఇంకా వెంటాడుతున్నాయి. అవేంటంటే.. ఉంగరం ఏమైంది..? ఉంగారాన్ని మింగిన చాప ఏమైంది..?” అంటూ ముగించాడు నాని. 

మరింత సమాచారం తెలుసుకోండి: