కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ కనీవిని నష్టాన్ని చవి చూస్తోంది. ఒక సూక్ష్మజీవి చేతిలో చిక్కుకొని సినీ ఇండస్ట్రీ అతలాకుతలం అయింది. చరిత్రలో ఇండస్ట్రీ ఎన్నో సంక్షోభాలను విపత్తులను ఎదుర్కొన్నప్పటికీ ఇంతటి రేంజ్ లో ఎప్పుడు నష్టం చవి చూడలేదు. రెండు నెలలుగా సినిమా షూటింగ్స్ బంద్ అయ్యాయి. థియేటర్స్ మల్టిప్లెక్సెస్ మూతపడ్డాయి. దీంతో ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. సినిమా మీద ఆధారపడి బ్రతుకుతున్న కొన్ని లక్షల కుటుంబాలకు జీవనోపాధి లేక జీవనం కష్టంగా మారింది. ఇప్పటికే ఇండస్ట్రీకి కొన్ని కోట్ల మేర నష్టం వాటిల్లింది. అయితే ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి ప్రభుత్వం ఈ మధ్య కొన్ని రంగాలకు కాస్త మినహాయింపులు ఇస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో పలు రంగాలకు అటు కేంద్ర ప్రభుత్వం సడలింపులు ఇవ్వగా.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరికొన్ని రంగాలకు మినహాయింపులు ఇస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం షూటింగులకు అనుమతిస్తూ జీవో జారీ చేసింది. ఇక తెలంగాణాలో జూన్ నుండి షూటింగులకు అనుమతి ఇవ్వబోతున్నట్లు చెప్పింది.

 

ఇప్పటికే సినిమా షూటింగ్స్ కి అనుమతులు రాగా కొద్దిరోజులలో థియేటర్స్ పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సీటింగ్ మరియు అనేక విషయాలలో గవర్నమెంట్ కొత్త సూచనలు షరతులు చేసే అవకాశముందు. అందుకే ఇప్పటికే కొన్ని థియేటర్ యాజమాన్యాలు దీనిపై దృష్టి సారించాయి. రానున్న రోజులలో సోషల్ డిస్టెన్స్ ప్రాధాన్యం మరింత పెరిగేలా ఉంది. ఇక థియేటర్స్ లో సైతం సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిన పరిస్థితి. దీనికి అనుగుణంగా థియేటర్స్ సీట్ల నిర్మాణం కూడా ఉండేలా థియేటర్ యాజమాన్యాలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ లోని ఆర్ టి సి క్రాస్ రోడ్స్ నందు గల సుదర్శన్ థియేటర్స్ లో ఇప్పటికే దీనికి సంబందించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. ఆ థియేటర్ లో సీటింగ్ సిస్టమ్ మార్చివేస్తూ మరమత్తులు చేస్తున్నారు. ప్రేక్షకులు కూర్చుండే సీట్స్ మధ్య కనీసం మూడు అడుగుల గ్యాప్ తో సీట్స్ ఏర్పాటు చేస్తున్నారు. కాగా ఇప్పటికే మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు తాము పాటించబోతున్న విధి, విధానాలను మరియు తీసుకోబోతున్న జాగ్రత్తలకు సంబంధించిన ప్లాన్‌ ను సిద్ధం చేసి పంపిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: