నందమూరి బాలకృష్ణ హీరోగా లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం లో వచ్చిన చిత్రం `ఆదిత్య 369`. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేరనే చెప్పాలి. ఈ చిత్రం బాలకృష్ణ సినీ కెరీర్లోనే కాదు, తెలుగు సినీ చరిత్రలోనూ విశేషంగా ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా కథ, కథనం వైవిధ్యంగా రూపొందిన సంగతి తెలిసిందే. 1989లో సాగే ఈ కథలో హీరో, హీరోయిన్, ఓ పోలీస్ - టైమ్ మిషన్ ఎక్కి కృష్ణదేవరాయల కాలానికి వెడతారు. అక్కడ నుండి భవిష్యత్ లోని మరో కాలంలోనూ విహరించి, చివరకు తామున్న కాలానికే తిరిగివస్తారు. ఇదీ ఆదిత్య 369 కథ. బాక్ టు ఫ్యూచర్ అనే ఆంగ్ల చిత్రం, ఇంకా హెచ్.జి.వెల్స్ టైం మెషీన్ నుండి స్ఫూర్తి పొంది తీసిన చిత్రం ఇది.
సైన్స్ఫిక్షన్ను, చరిత్రను, ప్రేమను, క్రైమ్ను జోడించి తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణ సరసన మోహిని హీరోయిన్గా నటిచింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చిన మొదటి సైన్స్ ఫిక్షన్ సినిమా ఇది.. టైం మెషీన్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడంతో పాటు ట్రెండ్ సెట్ చేసింది. ఇక ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో అలరించారు. కృష్ణకుమార్గా, శ్రీ కృష్ణ దేవరాయలుగా తన నటనతో ఆకట్టుకున్నారు. అలాగే టైం మెషీన్ కథాంశంతో ప్రేక్షకులకి సరికొత్త అనుభూతి అందించారు సింగీతం.
అంతేకాదు, ఈ సినిమాకు చిరంజీవి యాడ్ కూడా చేశారు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ నటన, సింగీతం దర్శకత్వ ప్రతిభ, ఇళయారాజా సంగీతంతో పాటు చిరు ప్రచారం కలిసొచ్చి ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. అయితే ఇటీవల ఈ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కనుందని నాలుగైదేళ్లుగా ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్ కాస్త డౌన్ ఫాల్ లో ఉన్న నేపథ్యం లో రిస్క్ తీసుకో లేక ఆలస్యం చేస్తున్నారని ప్రచారమైంది. కానీ ఏదో ఒకరోజు ఈ సీక్వెల్ ఆదిత్య 999 పేరుతో సెట్స్ పైకి వెళ్లడం మాత్రం ఖాయమని నందమూరి ఫ్యాన్స్ భావిస్తున్నారు.