బయట కరోనా ఉంది. అది మహమ్మారిలా రెచ్చిపోతోంది. దానికి ఎటువంటి సడలింపులు లేవు. బతుకు గడవడం కోసం పాలకులే కొన్ని సడలింపులు ఇచ్చారు. ఇది అందరికీ తెలిసిందే. ఇపుడు మూడు నెలలుగా నిలిచిపోయిన సినిమా షూటింగులకు అనుమతిస్తామని తెలంగాణా సర్కార్ చెప్పింది. ఆంధ్రా ప్రభుత్వం కూడా సై అంటోంది.
అంటే ఇపుడు బంతి సినీ పరిశ్రమ కోర్టులో ఉంది. ఇన్నాళ్ళు పర్మిషన్లు లేవు అని చేతులు ముడుచుకుని కూర్చున్న సినీ పరిశ్రమ ఇపుడు కదులుతుందా. కదిలితే ఎవరు ముందుకు అడుగు వేస్తారు. ఎంతమంది సహకరిస్తారు అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న.
ఎందుకంటే సినిమా షూటింగ్ అంటే తమాషా కాదు, కనీసం వంద మంది వరకూ మనుషులు స్పాట్ లో ఉండాలి. షూటింగ్ స్పాట్ కి వచ్చే వారూ పోయే వారు కూడా ఎక్కవ. అక్కడ నో గేట్స్. నో బారికేడ్స్. అందువల్ల సినిమా షూటింగ్ ఒకసారి కనుక మొదలుపెడితే ఎవరినీ ఆపడం కష్టం.
ఇక సామాజిక దూరాలు, తరచూ శానిటైజ్ చేయడాలూ ఇవన్నీ కొత్తల్లో పాటించినా తరువాత చిత్తశుద్ధితో చేయడం కష్టం. ఈ నేపధ్యంలో షూటింగులకు పెద్ద ఇబ్బంది అంటున్నారు.
మరో వైపు సినిమా కధకు అనుగుణంగా ముద్దులూ మురిపాలు ఉంటాయి. కౌగిలింతలూ, గిలిగింతలూ ఉంటాయి. అలాటిది సినిమా షూటింగుల అవేమీ లేకుండా చేయడం అంటే కష్టమే మరి దాన్ని కూడా అంతా జాగ్రత్తగా చూసుకోవాలి. మహారాష్ట్ర సర్కార్ కూడా షూటింగులకు అనుమతులు ఇచ్చింది కానీ ముద్దులు, కౌగిలింతలు, యాక్షన్ సీన్లు వద్దు అనేసింది. మరి ఇన్ని ఆంక్షల మధ్య అనుమతులు వచ్చినా కూడా సినిమా షూటింగ్ సాధ్యమేనా అంటే జవాబు కష్టమే. చూడాలి ఎవరు ముందుకు వస్తారో.