కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. నందమూరి నట వారసత్వాన్ని పునికి పుచ్చుకుని నటుడిగానే కాకుండా.. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ సంస్థని స్థాపించి నిర్మాతగా పలు చిత్రాలను సైతం నిర్మించాడు కళ్యాణ్ రామ్. ఈయన బాలనటుడిగా 1989లో బాలగోపాలుడు సినిమాలో నటించి మెప్పించాడు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా తరువాత 2003 లో `తొలిచూపులోనే` అనే సినిమాతో పూర్తి స్థాయి హీరోగా కళ్యాణ్ రామ్ ఎంట్రీ ఇచ్చాడు. అభిమన్యు, అసాధ్యుడు లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
2005లో వచ్చిన అతనొక్కడే సినిమాతో రికార్డు సృష్టించాడు. ఈ చిత్రానికి నిర్మాత కూడా కళ్యాణ్ రామ్మే. అనంతరం వరుసగా తానే హీరోగా హరేరామ్, జయీభవ, కల్యాణ్రామ్ కత్తి, ఓమ్ 3డీ, పటాస్, ఇజం లాంటి సినిమాలు నిర్మించాడు. అంతేకాకుండా రవితేజ హీరోగా కిక్ 2, సోదరుడు జూనియర్ ఎన్టీఆర్తో జై లవకుశ చిత్రాలను కూడా నిర్మించాడు. ఇక ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్గా కొనసాగుతున్న అనిల్ రావిపూడి లైఫ్ ఇచ్చింది కూడా కళ్యాణ్ రామ్మే. కళ్యాణ్ రామ్ నటించిన ‘పటాస్’ సినిమాతో దర్శకుడిగా అనిల్ రావిపూడి ఎంట్రీ ఇచ్చాడు.
అయితే వాస్తవానికి అనిల్ పటాస్ కథను సిద్ధం చేసుకుని హీరోలచుట్టూ, నిర్మాతల చుట్టూ తిరుగుతున్న సమయంలో.. ఏ ఒక్కరూ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. అలాంటి పరిస్థితుల్లో అనిల్ కల్యాణ్ రామ్ను కలవగా.. తను హీరోగా చేయడానికి ఓకే చెప్పారు. కానీ అప్పటికే నిర్మాతగా `ఓమ్` సినిమాతో దెబ్బతిని ఉండటం వల్ల తన బ్యానర్లో చేయలేనని చెప్పారు కళ్యాణ్ రామ్. దీంతో అప్పటి నుంచి వారిద్దరూ నిర్మాతల కోసం తిరిగారు కానీ అదీ సక్సెస్ కాలేదు. చివరికు కల్యాణ్ రామ్.. అనిల్ రావిపూడి కోసం రిస్క్ తీసుకుని మరీ.. తానే స్వయంగా పటాస్ సినిమాను నిర్మించారు. ఇక పటాస్ సినిమా ఎంతటి ఘన విషయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ రోజున కళ్యాణ్ రామ్ రిస్క్ తీసుకోవడం వల్లనే ఈ రోజున అనిల్ రావిపూడి స్టార్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నారు అనడంలో సందేహం లేదు.