ఈ మద్య టాలీవుడ్ పై జీహెచ్ఎంసీ కొరడా ఝుళిపిస్తుంది. అనుమతి లేకుండా ఎలాంటి పనులు చేపట్టినా వాటికి వెంటనే చెక్ పెడుతుంది. ఇటీవల ‘సైరా’మూవీ విషయంలో ఇతర కొన్ని సినిమాల విషయంలో జీహెచ్ఎంసీ కఠిన నిర్ణయాలు తీసుకుంది. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కి జీహెచ్ఎంసీ అధికారులు పెద్ద షాక్ ఇచ్చారు. అతడు హీరోగా నటిస్తోన్న 'నిను వీడను నీడను నేనే' సినిమా రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు కూడా ఈ కుర్ర హీరోనే చూసుకుంటున్నారు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్ కోసం హైదరాబాద్లోని మెట్రో పిల్లర్ల వద్ద ప్రచార పోస్టర్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ పోస్టర్లను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. పోస్టర్లలో హీరో, హీరోయిన్లను అసభ్యంగా చూపించారని ఉప్పల్ కు చెందిన కొంతమంది ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీంతో ఉప్పల్ మెట్రో పిల్లర్ల వద్ద ఏర్పాటు చేసిన సినిమా పోస్టర్లను చించేశారు. కాగా, అధికారుల తీరుపై ఈ సినిమా యూనిట్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి మూవీ పోస్టర్లు ఎన్ని వెలసినా వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని..తమ సినిమా ప్రచార కార్యక్రమాలకు జీహెచ్ఎంసీ అనుమతి తీసుకున్నామని, అయినా పోస్టర్లను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.