'నేను శైలజ ' పరిచయం అయిన మాలీవుడ్ భామ కీర్తి సురేష్ తన నటనతో మంచి మార్కులే కొట్టేసింది. ఆ తర్వాత నేచురల్ స్టార్ నానితో కలిసి ‘నేను లోకల్’ లో నటించింది. ఈ సినిమాలో నానికే కాదు కీర్తి సురేష్ కి ఎంతో గొప్ప పేరు వచ్చింది. దాంతో తెలుగు, తమిళ, మళియాళ ఇండస్ట్రీలో కీర్తి సురేష్ మంచి ఫామ్ లోకి వస్తుందన్న సమయంలో ‘మహానటి’ సినిమాతో మరింత క్రేజ్ పెంచుకుంది. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమా ఆమె స్థాయిని అమాంతంగా పెంచేసింది.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తీసిన ‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్రకు కీర్తి సురేష్ జీవం పోసిందని సినీ ఇండస్ట్రీ నుంచే కాదు రాజకీయ నేపథ్యంలో కూడా ప్రశంసల జల్లు కురిపించారు. మహానటి సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే దర్శకధీరుడు రాజమౌళి ఇందులో నటీ నటుల గురించి ముఖ్యంగా కీర్తి సురేష్, దుల్కన్ సల్మాన్ నటన గురించి ఎంతో గొప్పగా ప్రశంసించారు. తాజాగా టాలీవుడ్ లో ఇప్పుడు సెన్సేషనల్ వార్త చక్కర్లు కొడుతుంది.
త్వరలో రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రాంచరణ్ మల్టీ స్టారర్ సినిమాలో కీర్తి సురేష్ చాన్స్ లభించినట్లు చెప్పుకుంటున్నారు. ‘మహానటి ’ సినిమా చూసిన మొదటి రోజే కీర్తి సురేష్ నటనకు రాజమౌళి ఫిదా అయినట్లు..ఆమె హావభావాలు చాలా అద్బుతంగా పలికించిందని తెగ మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా రాజమౌళి ఒక భారీ మల్టీ స్టారర్ మూవీని రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.
ఈ సినిమాలో కథానాయికల కోసం అన్వేషణ కొనసాగుతోంది. తన సినిమాలో ఒక హీరోయిన్ గా ఆమెను తీసుకోవాలని ఆయన భావిస్తున్నట్టుగా చెబుతున్నారు. అదే నిజమైతే ఆమె ఎన్టీఆర్ జోడీగా కనిపిస్తుందో .. చరణ్ సరసన అలరిస్తుందో చూడాలి.