భారతీయ చలన చిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరోలు అతి కొద్ది మందిలో..సూపర్ స్టార్ రజినీకాంత్ ఒకరు. తమిళ తంబీలకు ఆరాద్య దైవంగా రజినీకాంత్ ని ఎంతగానో అభిమానిస్తారు. ఇక రజినీకాంత్ సినిమా వచ్చిందంటే చాలు..అభిమానులకు పండుగ వాతావరణం. వారం రోజుల ముందు నుంచే థియేటర్ల వద్ద నానా హంగామా చేస్తుంటారు..ఇక రివ్యూలకు సంబంధం లేకుండా రజినీకాంత్ క్రేజ్ పైనే సినిమా కొంత కాలం నడుస్తుందంటే అతిశయోక్తి లేదు.
భారత దేశంలోనే కాదు..ప్రపంచ దేశాల్లో కూడా రజినీకాంత్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా రాజస్థాన్ లోని జైపూర్ లో ఉన్న సహార్ గఢ్ కోట మ్యూజియంలో రజనీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం బరువు 55 కిలోలు, ఎత్తు 5.9 అడుగులని మ్యూజియం డైరెక్టర్ శ్రీ వాస్తవ అన్నారు. ఇప్పటికే ఈ మ్యూజియంలో అమితాబ్ బచ్చన్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయగా త్వరలో ఖాన్ త్రయం సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, ఆమీర్ ఖాన్ల మైనపు విగ్రహాలు ఏర్పాటు చేస్తారట.
వాస్తవానికి జైపూర్లోని సహార్ గఢ్ కోట మ్యూజియంకి దక్షిణ భారతదేశం నుండి వచ్చే వారి సంఖ్య ఎక్కువ..వారి అభ్యర్థన మేరకు రజనీకాంత్ మైనపు విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందని శ్రీవాస్తవ అన్నారు. ఈ విగ్రహం తయారు చేసేందుకు శిల్పులు వ్యాంగ్ పింగ్, సుశాంత రే మూడు నెలల పాటు కష్టపడ్డారని అన్నారు. ఇటీవల ఏర్పాటు చేసిన హాకీ స్టార్ సందీప్ సింగ్ విగ్రహం ఎందరికో ఇన్స్పైరింగ్గా ఉంది.