గత కొంత కాలంగా సంచలన దర్శకులు రాంగోపాల్ వర్మకు బ్యాడ్ టైమ్ నడుస్తుంది. ఒకప్పుడు శివ లాంటి బ్లాక్ బస్టర్ అందించిన ఆయన తర్వాత కామెడీ, మాఫియా, హర్రర్ తరహా సినిమాలతో బాగా ఆకట్టుకున్నారు. తెలుగు లో మంచి ఫామ్ లో కొనసాగుతుండగా..బాలీవుడ్ కి పయనమయ్యారు. అక్కడ కూడా తనదైన మార్క్ చాటుకున్నప్పటికీ..తర్వాత సక్సెస్ సాధించలేకపోయారు. దాంతో మళ్లీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు..ఇక్కడ కొన్ని సినిమాలు తీసినా అవి పెద్దగా సక్సెస్ కాలేదు. ఒకప్పుడు నాగార్జున తో శివ లాంటి గొప్ప సినిమా తీసిన విషయం తెలిసిందే..ఆ సాన్నిహిత్యంతో చాలా సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ‘ఆఫీసర్’ సినిమా తీశారు.
కానీ ఈ సినిమా కూడా దారుణంగా ఫ్లాప్ అయ్యింది. దాంతో ఇక ఇండస్ట్రీలో రాంగోపాల్ వర్మ సినిమాలు తీస్తారా..లేదా అన్న అనుమానాలు వచ్చాయి. కానీ తాజాగా రామ్ గోపాల్ వర్మ మరో సినిమాను ప్రకటించాడు. గతంలో వర్మ దర్శకత్వంలో సర్కార్, ఎటాక్ ఆఫ్ 26/11 చిత్రాలను తెరకెక్కించిన పరాగ్ సంఘ్వీ కొత్త సినిమాను నిర్మించనున్నాడు. ఈ విషయాన్ని వర్మ సోషల్ మీడియా ద్వారా స్వయంగా ప్రకటించారు.
నిర్మాతతో పాటు వర్మ కూడా ‘వైరస్’ సంబంధించిన ప్రెస్నోట్ రిలీజ్ చేశారు. సెంట్రల్ ఆఫ్రికాకు వెళ్లిన ఓ విద్యార్థి అరుదైన వైరస్ బారిన పడటం.. తరువాత ఆ విద్యార్ధి భారత్ తిరిగి వచ్చిన తరువాత భారీగా జరిగిన ప్రాణనష్టం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కేవలం టైటిల్, కాన్సెప్ట్ మాత్రమే రివీల్ చేసిన దర్శక నిర్మాతలు. వైరస్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.