టాలీవుడ్ లో హ్యాపీడేస్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఆ తర్వాత తెలుగు, తమిళ ఇండస్ట్రీలో నటించింది. అయితే తమన్నాకు కెరీర్ పరంగా బిగ్గెస్ట్ హిట్ సినిమా ఏదీ రాలేదు. దాంతో బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. కానీ అక్కడ కూడా పెద్ద సక్సెస్ ఏమీ అందుకోలేక పోయింది. ఇక రాజమౌళి తీసిన బాహుబలి సినిమాలో అవంతిక పాత్రలో తమన్నాకు మంచి గుర్తింపు వచ్చింది.
తెలుగు, తమిళ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ లో కూడా నటిస్తుంది తమన్నా. ఇక కొరియోగ్రాఫర్ గా కెరీర్ ఆరంభించిన ప్రభుదేవ నటుడిగానే కాకుండా దర్శకుడిగా తన సత్తా చాటుతున్నాడు. తెలుగు, హిందీ భాషల్లో ప్రభుదేవ దర్శకత్వం వహించిన సినిమాలు బాగానే హిట్ అయ్యాయి. ఆ మద్య ‘అభినేత్రి’ సినిమాలో ప్రభుదేవా, తమన్నా తొలిసారి జంటగా నటించారు. రెండోసారి వీళ్లిద్దరూ జంటగా నటించిన సినిమా ‘ఖామోషి’.
ఈ హిందీ సినిమా ఇంకా విడుదల కాలేదు. తాజాగా ఈ జంట ముచ్చటగా మూడోసారి కలిసి నటించబోతున్నారు. ఈ సినిమాకు తమిళ నటుడు ఆర్. పార్తిబన్ దర్శకత్వం వహించబోతున్నారు.
‘యుగానికి ఒక్కడు’ చోళరాజు పాత్రలో నటించిన ఆర్. పార్తిబన్ తెలుగు వారికి సుపరిచితుడే. పార్తిబన్ దర్శకత్వం వహించే సినిమాలో ప్రభుదేవా, తమన్నా మూడోసారి జంటగా సందడి చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే దృవీకరించారు. ఇదొక కమర్షియల్ రివేంజ్ డ్రామా అని ఆయన తెలిపారు. ప్రస్తుతం తెలుగులో ‘ఎఫ్2’, ‘దటీజ్ మహాలక్ష్మీ’, ‘సైరా’ చిత్రాల్లో తమన్నా నటిస్తున్నారు.